భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న దేశాలను ఏకాకిని చేయాలని ఆయన అన్నారు. మాతృభూమిని ఉగ్రవాదం నుంచి కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన అమరుల స్మృతికి ఘనంగా నివాళులర్పిస్తున్నానని చెప్పారు. శాంతికి విఘాతం కలిగిస్తున్న ఉగ్రమూకలను ఓడించేందుకు భారత పౌరులంతా ఐకమత్యాన్ని చాటిచెప్పాలని అన్నారు.
ప్రతి సంవత్సరం మే 21వ తేదీని జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినంగా నిర్వహిస్తారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి రోజును జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినంగా జరుపుకుంటారు. . 1991 మే 21న ఎల్టీటీఈ ఆత్మాహుతి సభ్యురాలు రాజీవ్ గాంధీ కాళ్ళకు మొక్కి, ఆర్డీఎక్స్ బెల్ట్ బాంబును పేల్చింది. నాటి నుంచి మే 21ని దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు.
జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా.. మాతృభూమిని ఉగ్రవాదం నుంచి కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన అమరుల స్మృతికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను. భారత్లో శాంతికి విఘాతం కలిగిస్తున్న ఉగ్రమూకలను ఓడించేందుకు భద్రతాబలగాలకు మద్దతుగా భారతీయ పౌరులందరూ తమ ఐకమత్యాన్ని చాటాలి. #AntiTerrorismDay
— Vice President of india (@VPSecretariat) May 21, 2020