తెలంగాణలో రోజురోజుకు కరోనా విషం చిమ్ముతోంది. ప్రజలకే కాకుండా ఆసుపత్రులలోనూ వైద్య సిబ్బందికి కోరానా సోకడం ఆందోళన కలిగిస్తున్న అంశం. మరోవైపు దేశవ్యాప్తంగా పోలీసులు, జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడుతున్నారు. రాష్ట్రంలో నిత్యం వెల్లడవుతున్న కొత్త కేసుల్లో ముప్పావు భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనే గుర్తిస్తున్నారు. నిన్న ఒక్కరోజే 888 మందికి కరోనా నిర్ధరణ అయింది. ఇలా ప్రతిరోజూ వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వస్తుండడంతో సీఎం కేసీఆర్ కూడా ఈ విషయంపై దృష్టి సారించారు.  

 

అయితే, కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా వస్తున్నాయని భయపడరాదని, అందరికీ చికిత్స అందించేందుకు తమ ప్రభుత్వం సన్నద్ధంగానే ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో లాక్ డౌన్ విధించాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయని వెల్లడించారు. మరో మూడ్నాలుగు రోజుల్లో దీనిపై పక్కా ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.

 

హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా నియంత్రణకు పటిష్ట వ్యూహం తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు.   కరోనా పరిస్థితులపై ఆయన ఇవాళ హైదరాబాద్ ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: