దేశ సరిహద్దులో చైనా, పాకిస్తాన్ దేశాలు క‌వ్వింపుచ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నాయ‌ని, వాటికి త‌గిన‌రీతిలో బుద్ధిచెబుతామ‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి హెచ్చ‌రించారు. గురువారం ఆయన తిరుపతిలోని అమరవీరుల సంస్మరణ స్థూపం వద్ద జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయ‌డానికి పాక్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని, పాక్ దుశ్చ‌ర్య‌ల‌ను తిప్ప‌కొడ‌తామ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ హయాంలో దేశంలో ఎక్కడా అల్లర్లుకారీ, ఉగ్ర‌వాదుల దాడులు కానీ జ‌ర‌గ‌లేద‌నే విష‌యాన్ని ఆయ‌న గుర్తుచేశారు. దేశ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నార‌న్నారు. దేశం కోసం త్యాగం చేసిన వారిని ఎప్పటికీ గుర్తించుకోవాల‌ని, తిరుపతి లాంటి ప్రాంతంలో దేశంలో ఎంతోమంది త‌మ ప్రాణాల‌ను బ‌లిచ్చార‌న్నారు. సైనికుల కుటుంబాలకు అంద‌రూ అండ‌గా నిల‌బ‌డాల‌ని, వీరసతీమణుల ఆశీర్వాదం తీసుకోవాలని ప్రధానమంత్రి మోడీ సూచించిన‌ట్లు కిష‌న్‌రెడ్డి చెప్పారు. దేశం లోప‌ల మ‌నం ప్ర‌శాంతంగా నిద్ర‌పోగ‌లుగుతున్నామంటే అది సైనికుల‌వ‌ల్లేన‌ని, దేశ‌ స‌మ‌గ్ర‌త‌ను కాపాడాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌ని గుర్తుచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: