ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ రోషయ్య మృతి చెందిన విషయం తెలుసుకోగానే పలువురు సంతాపాన్ని ప్రకటించారు. కొందరూ నేరుగా రోశయ్య మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొనిజేటి రోశయ్య మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి ప్రగాఢ సంతాపం తెలిపారు. రోశయ్య మంచి రాజకీయ నాయకుడు, మేధావి, ఆర్థికవేత్త అని కొనియాడారు.
మాజీ ఆర్థికమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా, గవర్నర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు విశేష సేవలు అందించారని కొనియాడారు చిరంజీవి. ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత అని, రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడం లో ఓ రుషి మాదిరిగా సేవ చేసారని గుర్తు చేసారు. రోశయ్య కన్నుమూయడంతో రాజకీయాలలో ఓ శకం ముగిసింది అని పేర్కొన్నారు. నన్ను రాజకీయాల్లోకి రావాలని మనస్పూర్తిగా ఆహ్వానించారు అని, వివాద రహితులుగా, నిష్కళింకితులుగా ప్రజా మన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య అని కొనియాడారు చిరంజీవి.