కరోనా దెబ్బతో భారత స్టాక్ మార్కెట్ కుదేలవుతోంది. ఏ రోజు కారోజు మార్కెట్ పూర్తిగా పడిపోతోంది. స్టాక్ మార్కెట్లు గత పది రోజులుగా మహా పతనం దిశగా వెళుతున్నాయి. ఈ పతనానికి ఎప్పుడు బ్రేక్ పడుతుందో ? తెలియని పరిస్థితి. అటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చడంతో పాటు ఇటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గించడం.. ఇటు ఉత్పత్తి రంగం కుదేలవ్వడం... అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోతుండడంతో మార్కెట్లు సైతం కుప్పకూలిపోతున్నాయి.
ఇక సోమవారం ఈ ఎఫెక్ట్ అంతా మార్కెట్లపై తీవ్రంగా పడింది. ట్రేడింగ్ అలా స్టార్ట్ అయ్యిందో లేదో సూచీలు వెంటనే పడిపోయాయి. కీలకమైన బీఎస్ఈ సెన్సెక్స్ 1825 పాయింట్ల నష్టంతో 32,271 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 482 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. నిఫ్టీ ప్రస్తుతం 10,000 పాయింట్ల దిగువన 9472 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక కరోనా వైరస్ ప్రభావం మరి కొంత కాలం కొనసాగుతుందన్న అంచనాలే ఉన్నాయి..
అసలు ఈ వైరస్ ఎప్పుడు తగ్గుతుందో ? ఎవ్వరూ చెప్పలేకపోవడంతో ప్రపంచ ఇన్వెస్టర్లపై ఈ ప్రభావం ఎక్కువుగా ఉంది. ఇదే పరిస్థితి మరి కొంత కాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెను విధ్వంసానికి లోనవుతుందనే ఆందోళన రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. స్టాక్మార్కెట్ భారీ పతనంతో తొలి 15 నిమిషాల్లోనే రూ 6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.