సీ ఫుడ్.. ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చేపల కూర అయితే అబ్బో.. ఓ రేంజ్ లో సూపర్ గా ఉంటుంది. తినే కొద్ది తినాలి తినాలి అనిపించేలా ఈ చేపల కూర ఉంటుంది. మసాలా చేప కూర అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాంటి సూపర్ టేస్టీ వంటకాన్ని ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.
మసాలా చేపకు కావాల్సిన పదార్ధాలు..
ఏదైనా ఒక రకం చేప - ఒకటి,
నిమ్మకాయ - ఒకటి,
ఉప్పు - రుచికి తగినంత,
ఎండుమిర్చి - పది,
లవంగాలు - ఆరేడు,
దాల్చినచెక్క - చిన్నవి రెండు,
ఆకుపచ్చ యాలకులు - ఐదు,
జీలకర్ర, నల్ల మిరియాలు - పావు చెంచా,
అల్లం ముక్కలు - రెండు,
వెల్లుల్లి, ఉల్లిపాయ - ఒక్కోటి చొప్పున,
నూనె - టేబుల్స్పూను,
పంచదార - చెంచా,
వెనిగర్ - కొద్దిగా.
తయారీ విధానం..
ఎండుమిర్చి, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, జీలకర్ర, మిరియాలను నీటిలో నానబెట్టి పక్కకు తియ్యాలి. అల్లం, వెల్లుల్లిని వెనిగర్లో నానబెట్టాలి. ఇంకాసేపు తరవాత వీటన్నింటినీ పేస్ట్ లా తయారు చేసి పాన్ లో చెంచా నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించి పంచదార చల్లాలి. రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని సిద్ధం చేసుకున్న మసాలా మిశ్రమానికి కలపాలి.
చేపను శుభ్రం చేసి విడిపోకుండా ముక్కల్లా తరగాలి. ఇందులో తయారు చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని సరిపడా ఉప్పు, నిమ్మరసం చేపకు పట్టించి ఫ్రిజ్లో పెట్టాలి. గంటయ్యాక తీసి పెనంపై మిగిలిన నూనె వేడి చేసి వేయించాలి. బంగారువర్ణంలోకి వచ్చేదాకా రెండువైపులా కాల్చితే అదిరిపోతుంది. మరి ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే ఈ మసాలా చేపను తయారు చేసుకోండి.. రుచిగా తినేయండి.