నిజామాబాద్ జిల్లా బోధన్ లో సంచలనం కలిగించిన “దొంగ పాస్ పోర్టు స్కాం” పై దర్యాప్తు వేగవంతమైంది. ఈ సంఘటనలో విమర్శలు రావడంతో, తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కంచె చేను మేసిన చందంగా, నగర స్పెషల్ బ్రాంచ్ పోలీసులే కీలకంగా సహకరించినట్లు తెలుస్తుంది.
నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన కొందరు వ్యక్తులు శంషాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారి పాస్ పోర్టులు పరిశీలించిన ఇమ్మినేషన్ ఆఫీసర్లు అవి దొంగవని తేల్చారు. ఈ సంఘటనలో ఈ నెల 4 న, ఒక ఎస్సై, ఒక ఏఎసై తో పాటు, మరో ఏజెంట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మయన్మారుకు చెందిన రోహింగ్యాలను బోదన్ వాసులుగా చెలామణి అయ్యేలా పాస్- పోర్టులు ఇచ్చారు. రెండేళ్ల క్రితం స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ వీటికి క్లియరెన్స్ ఇచ్చారు. ప్రస్తుతం సిద్దిపేట ఎస్సైగా పనిచేస్తున్నమల్లేష్ ఇంట్లో అద్దెకున్న ఏజెంటు ద్వారా 72 పాస్ పోర్టులు జారీ అయినట్టు గుర్తించారు.
ఒకే అడ్రస్ నుంచి 32 పాస్ పోర్టులు జారీ అయినట్టు తేలడంతో అధికారులు కూడా షాక్ అవుతున్నారు. మయన్మార్ వయా బంగ్లాదేశ్ వయా పశ్చిమ బెంగాల్ నుండి వాళ్ళు సురక్షిత ప్రాంతంగా భావించే నిజామాబాద్ జిల్లా బోధన్ స్థిర నివాసం ఏర్పరచుకున్నట్లు సమాచారం.
బోధన్ పాస్ పోర్టుల కుంభకోణంలో, తప్పుడు పత్రాలను సమర్పించి 19 మంది విదేశాలకు వెళ్లినట్లు పోలీసులు తేల్చారు. వారిని వెనక్కి రప్పించేందుకు లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు. ఏడు చిరునామాలపై 72 పాస్పోర్టులు జారీ అయ్యాయని, వాటిల్లో 46 కేవలం ఐదు ఫోన్ నంబర్లతో జారీ అయినట్లు గుర్తించారు.
ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు మొత్తం 11 మంది సూత్రధారులుగా నిర్ధారించారు. వారిలో 8 మందిని అరెస్టు చేశామని, మరో ముగ్గురు పరారీ లో ఉన్నారని, నిన్న మంగళవారం విలేకరుల సమావేశంలో, సైబరాబాద్ పోలీసు కమిషనర్, వీసీ సజ్జనార్ తెలిపారు ఆయన ఈ కేసు వివరాల ను వెల్లడించారు. గత నెల 24 న ముగ్గురు బంగ్లాదేశీయులు - నితాయ్ దాస్, మహమ్మద్ హసీబ్-ఉర్-రెహ్మాన్, మహమ్మద్ రాణా మియా, భారత పాస్పోర్టులపై దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించగా, శంషాబాద్ విమానాశ్రయం లోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. వారిని విచారించగా ఈ వ్యవహారం వెనక భారీ కుంభకోణం ఉన్నట్లు గుర్తించామని సీపీచెప్పారు.
‘‘బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన కొందరు పశ్చిమ బెంగాల్లో తప్పుడు పత్రాలతో ఆధార్ కార్డులను సంపాదించారు. పశ్చిమ బెంగాల్ లోని నాదియా జిల్లాకు చెందిన షహనాజ్ పాయిల్ అనే ఏజెంటు వారికి సహకరించాడు. ఆ తర్వాత బంగ్లాదేశీయులు బోధన్కు చేరుకుని, ఆధార్కార్డుల్లో స్థానిక చిరునామా మార్పించి వాటితో బోధన్లో పాస్పోర్టులు తీసుకున్నారు. ఇమ్మిగ్రేషన్లో గుర్తించిన నిందితులను విచారణ లో ఈ ముఠా గుట్టు రట్టయింది’’ అని సీపీ వివరించారు.
కుంభకోణం వెనక మొత్తం 11 మంది ఉన్నట్లు గుర్తించామని, ముగ్గురు పరారీలో ఉండగా, ఏఎస్సై అనిల్కుమార్, ఎస్సై మల్లేశ్, ఏజెంట్ షహనాజ్ పాయిల్, దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన నితాయ్ దాస్, మహమ్మద్ హసీబ్-ఉర్-రెహ్మాన్, మహమ్మద్ రాణా మియా, పరిమళ్ బెయిన్, మీ-సేవ కేంద్ర నిర్వాహకుడు మతీన్ అహ్మద్ మిర్జాను అరెస్టు చేశామన్నారు.
వీరిలో పరిమళ్ బెయిన్ చాలా కాలం క్రితమే బోధన్కు వచ్చి, పాస్పోర్టు షహనాజ్ సాయంతో తీసుకున్నాడని చెప్పారు. బంగ్లాదేశీయులకు బోధన్లో ఆశ్రయం కల్పించడం, అద్దె గదులు ఇప్పించడం, పాస్పోర్టు తీసుకునేదాకా బాగోగులు చూడడం పరిమళ్ బాధ్యత అని వివరించారు.
ఎస్సై మల్లేశ్, ఏఎస్సై అనిల్ కుమార్లు ఈ గ్యాంగ్కు పాస్పోర్టు వచ్చేలా, వెరిఫికేషన్లో సహకరించేవారని తెలిపారు. ఈ గ్యాంగ్కు పశ్చిమ బెంగాల్లో తప్పుడు పత్రాలతో ఆధార్కార్డు ఇప్పించడంలో సహకరించిన మనోజ్ అనే వ్యక్తి ప్రస్తుతం ఇరాక్లో ఉన్నాడని, బంగ్లాదేశీయుల ను భారత్ సరిహద్దులు దాటించడంలో సహకరించే సమీర్, విమాన టికెట్లు సమకూర్చిన సద్దాం హుస్సేన్ లను ఇంకా అరెస్టు చేయాల్సి ఉందన్నారు.