నేటి సమాజంలో చాల మంది తొందరపాటు నిర్ణయాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలతో వందేళ్ల జీవితాన్ని విద్యార్థి దశలోనే ముగించేస్తున్నారు. ముఖ్యంగా ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు కూడా బలవన్మరణానికి పాల్పడడం ఆవేదన పెంచుతోంది. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థిని.. క్షణిక ఆవేశంలో.. ఒత్తిడికి గురై జీవితాన్ని ముగించేసింది. కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో క్యాంపస్ లో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ తృతీయ సంవత్సరం చదువుతున్న మొల్లి మాధురి (20) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. హోలీ కావడంతో తరగతులు లేకపోవడంతో విద్యార్థులందరూ హాస్టల్‌లోనే ఉన్నారు. ఐ3 హాస్టల్‌ భవనంలోని మూడో అంతస్తులో తన రూమ్‌లోనే మాధురి ఉండగా, మధ్యాహ్నం 12 గంటల సమయంలో తోటి విద్యార్థినులు భోజనానికి రమ్మని పిలవగా తాను తరువాత తింటానని, మీరు తినేసి రమ్మని బదులిచ్చి రూమ్‌లోనే ఉండిపోయింది.

దీంతో వారు మెస్‌కు వెళ్లి భోజనం చేసి తిరిగి వచ్చిన తరువాత రూమ్‌ తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో కేర్‌టేకర్‌కు చెప్పారు. దీంతో కేర్‌టేకర్‌ సెక్యూరిటీ వాళ్లకు తెలపగా వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ఉరివేసుకుని ఉంది. ఆమెను కిందకు దించి చూడగా చనిపోయింది. దీంతో మృతదేహాన్ని పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఇక రెండు రోజుల క్రితమే సెమిస్టర్‌ పరీక్షలు ముగిశాయి. ఈమె స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని గాంధీనగర్‌. విద్యార్థిని మృతి చెందిన విషయం తెలుసుకుని నూజివీడు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ఆచార్య జీవీఆర్‌ శ్రీనివాసరావు, సిబ్బంది తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సీఐ ఎం.వెంకటనారాయణ, ఎస్‌ఐ అప్పారి గణేష్‌ కుమార్‌ లు ఘటనా స్థలానికి చేరుకుని హాస్టల్‌ గదిని పరిశీలించారు. రూమ్‌లోని తోటి విద్యార్థులను పోలీసులు విచారించగా, ప్రేమ వ్యవహారమే కారణమని చెప్పినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: