ముఖ్యంగా కస్టమర్ కేర్ అంటూ ఎంతో మంది అమాయకులకు ఫోన్లు చేయడం ఇక మాయమాటలతో నమ్మించి వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడం లాంటివి చేస్తున్నారు ఎంతోమంది. అదే సమయంలో మీకు ప్రైజ్ మనీ వచ్చింది అంటూ మాయ మాటలు చెబుతూ ఎంతో మంది అమాయకులను బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్లు కూడా ఎక్కువ అయిపోతున్నారు. అయితే ఇలాంటి కాల్స్ నుంచి అప్రమత్తంగా ఉండాలి అంటూ పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. సైబర్ నేరగాళ్లు మాత్రం మోసాలకు పాల్పడెందుకు కొత్త దారులను వెతుకుతూ వుండడం గమనార్హం.
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. లక్కీ డ్రా వచ్చింది అంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఒక కుటుంబాన్ని బురిడీ కొట్టించారు. మెదక్ జిల్లా రేగోడు లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. లక్కీ డ్రా లో మీ మొబైల్ నెంబర్ పై 25 లక్షల గెలుచుకున్నారు అంటూ ఫోన్ వచ్చింది. దీంతో అది నిజమా అబద్దమా అని కాసేపు అనుమానం పడినప్పటికీ.. వచ్చిన అదృష్టాన్ని కాదనడం ఎందుకు అని సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడి పోయారు కుటుంబం. 10 వేలు చెల్లిస్తే ఇక మొత్తం నగదు మీ అకౌంట్లో జమ అవుతుంది అంటూ సైబర్ నేరగాళ్ల చెప్పారు. చెప్పినట్లుగానే 10000 చెల్లించగా మరో 25000 చెల్లిస్తే మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతుంది అంటూ చెప్పడంతో మోసపోయామని గ్రహించిన కుటుంబం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.