ఏ బంధం లో అయినా నమ్మకం అనేది పునాది లాంటిది. పునాది గట్టిగా ఉన్నప్పుడే భవనం నిలబడుతుంది. అలాగే నమ్మకం ఉన్నప్పుడే అటు బంధం కూడా నిలబడుతుంది అని చెప్పాలి. కానీ సాఫీగా సాగిపోతున్న బంధంలోకి అనుమానం పెనుభూతం దూరింది అంటే జరగరాని ఘోరం జరిగి పోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భార్య భర్తల బంధం లో అనుమానం అన్యోన్యతను దెబ్బతీస్తూ ఉంటుంది. మనస్పర్థలకు కారణం అవుతూ ఉంటుంది. చివరికి క్షణికావేశంలో ఎవరో ఒకరు హత్యల చేయటం లేదా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకు వస్తూ ఉంటుంది. లేదా చిన్నగా మొదలైన అనుమానం చివరికి భార్య భర్తలు విడిపోయిన విడాకులు తీసుకునేంత వరకూ దారితీస్తుంది అని చెప్పాలి.

 ఇది ఎవరో చెప్పడం కాదు ఇప్పటివరకూ ఎంతోమంది భార్య భర్తల విషయంలో నిజం అయింది అని చెప్పాలి. ఇక్కడ కొత్త జంటను అనుమానం బలితీసుకుంది. పెళ్లయి 2 నెలలు కూడా కాకముందే ఏకంగా రెండు జీవితాలు ముగిసాయ్. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరులో వెలుగుచూసింది. ఆత్మకూరు మండలానికి చెందిన హరీష్ ఏపీ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గౌరీ దేవి పేట కు చెందిన పుష్పలీల ను పెళ్లి చేసుకున్నాడు. జూన్ 17వ తేదీన వీరికి వివాహం జరిగింది.


 పెళ్ళయిన తర్వాత భార్యను ఎంతో సంతోషంగా చూసుకోవాల్సింది పోయి భార్యపై అనుమానం పడటం మొదలు పెట్టాడు హరీష్. శారీరకంగా మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఇక ఓ రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం కూడా చేశాడు. ఈ విషయంపై పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరుగగా ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతుంది అంటూ చెప్పాడు. పెద్ద మనుషులు రాజీ కుదుర్చారు. అయితే ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో హరీష్ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. చివరికి విచక్షణ కోల్పోయి గొడ్డలితో దారుణంగా దాడి చేసి చంపాడు. తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం  అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: