చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడర్(సీపెక్) పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ప్రాజెక్టు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కు మాత్రమే కాకుండా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కి కూడా ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ ప్రాజెక్టు కింద చైనా పాకిస్థాన్ లో పది బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.  దీనిలో భాగంగా భారీ రవాణా, ఇంధనం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేసింది.  ఇది అన్ని దేశాలకు తెలిసిందే.


అయితే ఎవరికీ తెలియకుండా మరో సరికొత్త ప్రాజెక్టు పాకిస్థాన్ తో కలిసి చైనా చేస్తోందని అమెరికా ఆరోపిస్తుంది. అదేంటంటే ప్రాపంగండ వార్.  అంటే తప్పుడు వార్తల ప్రచారపు యుద్ధం చేస్తోందని తమ నివేదికలో వెల్లడించింది. ఇది ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. అదేంటంటే ప్రపంచంలో తమకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకునేందుకు పలు విమర్శలను తిప్పికొట్టేందుకు చైనా సమాచార రంగంలో రష్యాతో కలసి పనిచేస్తోంది.


పాకిస్థాన్ లో చైనా చేపట్టిన సీపీఈసీ ప్రాజెక్టుపై అంతర్జాతీయ మీడియాలో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఈసీ మీడియా ఫోరం ద్వారా ఈ ఆరోపణలు ఎదుర్కోవాలని చైనా నిర్ణయించింది. దీనిలో భాగంగా చైనా పాకిస్థాన్ మీడియా కారిడార్ త్వరలోనే ప్రారంభం కానుంది. చైనాపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు ఈ రెండు దేశాలు సంయుక్తంగా ఒక వేదికను రూపొందించడంపై కూడా చర్చిస్తున్నట్లు యుఎస్ నివేదిక పేర్కొంది. దీని ప్రకారం చైనా రాయబార కార్యాలయానికి సంబంధించిన వార్తలకు పాక్ మీడియాలో అధిక ప్రాధాన్యం కల్పించనుంది. దీనికోసం చైనా భారీగానే నిధులు వెచ్చించినట్లు తెలిపింది.


పాక్ ప్రస్తుతం దయనీయ పరిస్థితిలో ఉంది. దీన్ని అవకాశంగా మలచుకొని వారికి సాయం చేస్తూ పాక్ మీడియాను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు చైనా యత్నిస్తోంది.  ఆదేశం చెప్పినట్లుగానే పాక్ భారత్ పై విషం చిమ్ముతోంది. మొత్తానికి పాకిస్తాన్‌ దుస్థితిని ఆసరాగా చేసుకుని చైనా ఆటలాడుకుంటోందని స్పష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: