ఏపీలో సార్వత్రికానికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అధినేతలు ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రచారం లో మునిగి తేలుతున్నారు. ఓటర్లపై చల్లని హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ని అచేతనం చేసి ఓడించాలని చంద్రబాబు వ్యూహం పన్నారు. అందుకే ఆయన ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. మరోవైపు జగన్ కూడా తాను ఒంటరిని చేసి అందరూ వస్తున్నారని.. తనపై కుట్రలు పన్నుతున్నారని సెంటిమెంట్ రగల్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఏపీలో ఈ సారి హోరా హోరీ పోరు తప్పేలా లేదు.
జగన్ తో పోల్చితే చంద్రబాబుకి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. ఇప్పటికే ఆయన ఏడుపదుల వయసులో ఉన్నారు. ఈ సారి ఓడితే రాజకీయాలకు దూరం కావాల్సిందే. ఒకవేళ ఉన్నా సలహాలు, సూచనలు చేయడానికి మినహా వయసు దృష్ట్యా పార్టీని నడిపే సత్తా ఆయనలో ఉండకపోవచ్చు. ఇప్పుడు ఓడితే టీడీపీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో ఉంటుందని ఆయన తెగించి పోరాడుతున్నారు.
తాను అధికారంలోకి రావడానికి గల కారణాలను బేరీజు వేసుకుంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, పవన్ పై నమ్మకం, మోదీ మేనియా ఇవి తనను గట్టెక్కిస్తాయి అని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. దీంతో పాటు సూపర్ సిక్స్ పథకాలు, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్, పెన్షన్ల పెంపుతో పాటు వాలంటీర్లకు జీతాలు పెంచుతాం అని హామీ ఇచ్చాం కాబట్టి వాళ్లు కూడా మనకే మద్దతు ఇస్తారు అని గంపెడాశలతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.