మహారాష్ట్రలో శివసేన,ఎన్సీపీల సంయుక్త ప్రభుత్వం..ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం, తమిళనాడులో పట్టులేని ప్రభుత్వం, తెలంగాణలో కేసీఆర్ అతి ఆత్మవిశ్వాసంతో వ్యవహరింపు ధోరణి, ఆంధ్రప్రదేశ్లో టెస్ట్ల గారడి కొనసాగుతోందని విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలకు ఇప్పుడు...బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోనా పెరుగుదలపై ప్రతివిమర్శలు ఎదురవుతున్నాయి. బీజేపీపాలిత కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ప్రభుత్వ గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. దీంతో బీజేపీ నేతల్లో గొంతుల్లో పచ్చి వెలక్కాయపడినట్లయింది.
గోడకేసి కొట్టిన బంతి తిరిగి వచ్చి తాకినట్లుగా..విమర్శలకు ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల నుంచి బీజేపీపై విమర్శల జల్లు మొదలైంది. మాకు నీతులు..హితవులు తర్వాత చెబుదురు గాని ముందు మీకు కరోనా తూట్లు పడకుండా చూసుకోండి అంటూ ఎద్దేవా చేస్తున్నారు. వాస్తవానికి కూడా పరిస్థితి అలానే ఎప్పుడూ వార్తల్లో ప్రధాని, కేంద్ర మంత్రుల ప్రకటనల్లో కూడా ముంబై, ఢిల్లీల ప్రస్తావనే ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ‘సరైన వ్యూహం లేదు, లాక్డౌన్ నిబంధనల అమలులో విఫలం, వైరస్ కట్టడికంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం.. బాధితులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం.. వెరసి కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మరణాలూ చోటుచేసుకుంటున్నాయి అంటూ విపక్షాల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఇందులో నిజాలు చాలా ఉన్నాయి.
గుజరాత్లో ఇప్పటివరకు 28000ల పైచిలుకుగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ర్టాలతో పోల్చితే గుజరాత్లోనే కరోనా మరణాల రేటు అధికంగా ఉండటం ఆందోళనపరుస్తోంది. ఉత్తరప్రదేశ్లో 20వేలకు పైబడి కేసులు నమోదయ్యాయి. 560 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షణాలు ఉన్నవారికి సైతం ప్రభు త్వం పరీక్షలు చేయడంలేదని, మరణాల సంఖ్యను తగ్గించి చెప్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 13 వేలకుపైగా కేసులు నమోదుకాగా, 530 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు ఇస్తున్న ప్రాధాన్యం.. కరోనా కట్టడికి ఇవ్వడంలేదని ప్రజలు మండిపడుతున్నారు. కర్ణాటకలో 9,450 వరకు కేసులు కాగా, 148 మంది మరణించారు. పాజిటివ్ వచ్చిన వారిని హోంక్వారంటైన్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించాయి. హర్యానా, హిమాచల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.