ఏమాటకామాటే చెప్పుకోవాలి.. అంటూ.. వైఎస్సార్ సీపీ నాయ‌కులు చెవిలో చిన్న‌గా చెప్పుకొంటున్న మాట‌లు.. పార్టీలో తీవ్ర క‌ల‌వ‌రానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. `జ‌గ‌న్ చెవిలో జోరీగ‌లు` అంటూ అధికార పార్టీ నేత‌లు ఒక‌రికొక‌రు గుస‌గుస‌లాడుతున్నారు. ఇంత‌కీ విష‌యం ఏంటాని ఆరాతీస్తే.. ఒక‌వైపు పార్టీలోను, మ‌రోవైపు ప్ర‌భుత్వంలోనూ జ‌గ‌న్ చుట్టూ చేరిన వారు చాలానే ఆశ‌లు పెట్టుకున్నార‌ని, అయితే, వారి ఆశ‌లు తీర్చే ప‌రిస్థితి ఇప్పుడు జ‌గ‌న్‌కు భారంగా మారింద‌ని నాయ‌కులు గుసగుస‌లాడుతుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వంలో చూసుకుంటే.. వివిధ శాఖ‌లు నిర్వ‌హిస్తున్న మంత్రులు తీవ్ర అసంతృప్తితో ర‌గులుతున్నారు.


అధికారాల‌న్నీ కూడా కీల‌క నాయ‌కుడి ద‌గ్గ‌రే ఉన్నాయ‌ని, ఆయ‌న చెప్పుచేత‌ల్లోనే తాము న‌డ‌వాల్సి వ‌స్తోంద‌ని వారు తీవ్ర‌స్థాయిలో అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఒక‌రిద్ద‌రు మిన‌హా .. మంత్రుల‌కు స్వేచ్ఛ లేకుండా పోయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అంతేకాదు, కీల‌క అంశాల్లో.. త‌మ‌ను ప‌క్క‌న పెడుతున్నార‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. ఇక‌, జిల్లాల్లోనూ మంత్రుల‌పై చుల‌కన భావం ఏర్ప‌డింద‌ని, త‌మ‌కు అధికారాలు లేక‌పోవ‌డ‌మే దీనికంత‌టికీ కార‌ణ‌మ‌ని మంత్రులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ చుట్టూ చేరి.. అయ్యా మాకు సంపూర్ణ అధికారాలు ఇవ్వ‌మ‌ని కోరుతున్నార‌ట‌.


ఇక‌, పార్టీ విష‌యానికి వ‌స్తే.. చాలా మంది నాయ‌కులు త‌మ‌కు ప‌ద‌వుల్లో అన్యాయం జ‌రిగింద‌ని ఎప్ప‌టి నుంచో ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కొంద‌రు ఈ విష‌యాల‌ను నేరుగా చెబుతుంటే.. మ‌రికొంద‌రు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ.. త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.  తాము గ‌త ఎన్నిక‌ల్లో త్యాగాలు చేశామ‌ని, ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేల గెలుపు కోసం తాము ఎంతో క‌ష్టించామ‌ని, అయితే, ఇప్పుడు జ‌గ‌న్ త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఇదే విష‌యంపై పార్టీలో కీల‌క నాయ‌కుడు, జ‌గ‌న్ కు స‌ల‌హాదారుగా ఉన్న ఓ నాయ‌కుడికి విన్న‌వించుకుంటున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో వీరి విష‌యం ఏం చేయాల‌నే అంశంపై జ‌గ‌న్ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ని.. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో వీరిని సంతృప్తి ప‌ర‌చ‌డం జ‌గ‌న్ భార‌మేన‌ని గుస‌గుస‌లాడుతున్నారు. మొత్తానికి ఈ విష‌యం అధికార పార్టీలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తే.. జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: