ప్రధాని మోదీ నిన్న పార్లమెంటులో ఏపీకి జరిగిన అన్యాయంపై గుండెలు బాదుకున్నారు. ఏపీని అడ్డగోలుగా విభజించారని మొత్తుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్యయుతంగా ఆంధ్రప్రదేశ్ ను విభజించిందని.. విమర్శించారు. తాము గతంలో మూడు రాష్ట్రాలు ఇచ్చినా ఎక్కడా గొడవల్లేవని గొప్పలు చెప్పుకొచ్చారు. పార్లమెంటులో తలుపులు మూసేసి.. లైట్లు తీసేసి.. పెప్పర్‌ స్ప్రేలు వాడి.. అరాచకంగా తెలంగాణ ఇచ్చారని మోదీ గుర్తు చేశారు.


బాగానే ఉంది. మోదీ చెప్పినదాంట్లో ఒక్క మాట కూడా అబద్దం లేదు. అంతా నిజమే.. అంతా మన కళ్ల ముందు జరిగిందే. మరి ఆనాడు ఇదే బీజేపీ చేసిందేంటి.. తలుపులు మూసేసి బిల్లు పాస్ చేస్తుంటే..ఇది అన్యాయం అని ఆనాడు చెప్పలేదే.. లైట్లు తీసేసి బిల్లు పాస్ చేస్తుంటే.. ఆరోజు తమ నిరసన తెలపలేదే.. తెలంగాణ ఇచ్చేయమని తాము కూడా వంతపాడిన సంగతి మర్చిపోయారా.. అదేమంటే మేం విభజనకు వ్యతిరేకం కాదు.. విభజించిన తీరునకు వ్యతిరేకం అంటున్నారు. మరి అంతగా ఉంటే.. ఆ నిరసన ఆనాడు ఎందుకు చెప్పలేదు.


అంతా జరిగిపోయాక ఇప్పుడు ఎందుకు మోదీ రాజకీయాలు చేస్తున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే.. ఓకే తెలంగాణ అడ్డగోలుగా ఇచ్చేయడం వల్ల ఏపీకి నష్టం జరిగింది. ఆ మాట వాస్తవమే అనుకుందాం.. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నది బీజేపీయే కదా.. మరి మోదీ ఎందుకు ఏపీకి న్యాయం చేయడం లేదు.. సాక్షాత్తూ ఆయనే తిరుపతి వచ్చి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇస్తామని చెప్పింది వాస్తవం కాదా.. ఆ తిరుమలేశుని సాక్షిగా మాట ఇచ్చింది వాస్తవం కాదా.


మరి ఇప్పుడు మోదీ ఎందుకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు.. ఎందుకు ఇంకా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చినా.. ప్రాజెక్టు మొదలై.. పదేళ్లు దాటినా ఇంకా పూర్తి కావడం లేదు.. ఎందుకు కడపకు స్టీల్ ప్లాంట్ ఇంకా రాలేదు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కదా.. మరి ఎందుకు అధికారంలో ఉండి కూడా మోడీ ఈ పనులు చేయడం లేదు.. ఇందుకు ఒక్కటే సమాధానం.. రాజకీయం.. కాంగ్రెస్‌ ను ఎండగట్టడమే మోదీ ఉద్దేశ్యం తప్ప.. ఏపీకి మేలు చేయడం కాదు.. ఏపీ కే కాదు.. తెలంగాణకూ ఆయన చేసిన మేలు ప్రత్యేకంగా ఏమీ లేదు. కేవలం రాజకీయం తప్ప..

మరింత సమాచారం తెలుసుకోండి: