వ్యూహ చతురత అన్న మాటకు నిలువెత్తు రూపంగా కనిపిస్తోంది బీజేపీ. ఐదేళ్లకు ఓ సారి జరిగే సార్వత్రిక ఎన్నికలను వ్యూహాత్మకంగా నడిపించే విషయంలో దేశంలోని ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే బీజేపీ ఎంతో ముందు ఉంటుంది. ఈ విషయంలో మోదీ-అమిత్ షా ద్వయాన్ని అభినందించి తీరాల్సిందే. కాషాయ దళ నేతలు ఎప్పుడూ విపక్షాన్ని ఢిపెన్స్ లో పడేసి.. తన రాజకీయ వ్యూహాలను చక్కగా అమలు చేస్తూ ఉంటుంది.


విపక్షాలు ఆ వ్యూహంలో చిక్కుకొని విలవిలలాడుతున్న వేళ కాగల కార్యాన్ని బీజేపీ చక్కగా నెరవేర్చుకుంటుంది. ఇది ప్రధాని నరేంద్ర మోదీకి వెన్నతో పెట్టిన విద్య. కానీ ఈ సారి సీన్ రివర్స్ అవుతోంది. బీజేపీని సక్సెస్ ఫుల్ గా ఢిపెన్స్ లో పడేయడయంలో ఇండియా కూటమి నేతలు ఈ సారి ముందు ఉన్నారు. వారు సంధిస్తున్న ప్రశ్నలు, చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడానికే బీజేపీ నేతలకు సమయం సరిపోతుంది.


వాస్తవానికి ఈ ఎన్నికల్లో కీలక అంశాలుగా సీఏఏ, ట్రిపుల్ తలాక్, ఉమ్మడి పౌర స్కృతి, రామ మందిరం, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఉంటాయని అంతా భావించారు. కానీ ఒక్క అయోధ్య రామాలయం మినహా మిగతా అంశాలన్నీ పక్కకు వెళ్లిపోయాయి. దీంతో పాటు చైనాతో ఉద్రిక్తతలు, వన్ నేషన్, వన్ ఎలక్షన్ వంటి జాతీయ అంశాలను తెరపైకి తెస్తారని అనుకున్నా మోదీ వాటిని ఏమీ ప్రస్తావించడం లేదు.


పైగా జైలు నుంచి విడుదల అయిన తర్వాత కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలు బీజేపీ నేతలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు మోదీ వారసత్వం, ఆదాయం, అదానీ, అంబానీ, ఉద్యోగాలు, ఉపాధి కల్పన , పెరుగుతున్న ధరలు వంటి అంశాల గురించి తప్పక ప్రస్తావించాల్సి వస్తోంది. వాస్తవంగా ఇది ఇండియా కూటమి సాధించిన విజయంగా చెప్పవచ్చు. ఎకనమిక్ ఎజెండాను సెట్ చేసి మోదీపై వదిలారు. వీటి నుంచి తప్పించుకోలేక మోదీ ఇప్పుడు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఇది మోదీ శైలికి విరుద్ధంగా జరుగుతున్న ఎన్నికలని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: