![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/gold/124/bangaram-shocking-news-maree-atha-taggindaa25ae57b3-3a23-468e-a0d0-9a67cc68d459-415x250.jpg)
బంగారం మన ఇండియన్లకు ఇదంటే ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారతీయ మహిళలకు స్వర్ణంపై మక్కువ ఎక్కువ. వారు చేయించుకునే నగలు ఎన్నిరకాలో.. ఎన్ని డిజైన్లో.. మరి అలాంటి బంగారం గురించి ఇది నిజంగానే ఓ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.. అయితే ఈ ఏడాది బంగారం బాగా తగ్గిపోయింది..
బంగారం తగ్గిపోవడం ఏంటీ.. అనుకుంటున్నారా.. లేక బంగారం ధర తగ్గిందనుకుంటున్నారా.. తగ్గింది ధర కాదు.. బంగారం దిగుమతి.. అవును.. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పసిడి దిగుమతులు 94 శాతం తగ్గాయట. కరోనా సంక్షోభం కారణంగా డిమాండ్ బాగా తగ్గిపోయింది కదా. మరోవైపు బంగారం ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. ఈ రెండు కారణాలతో పుత్తడి దిగుమతులు బాగా తగ్గిపోయాయట.
ఇక లెక్కల్లోకి వెళ్తే.. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సుమారు 5వేల 160 కోట్ల విలువైన బంగారం దిగుమతి అయింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి సుమారు 86వేల 250 కోట్ల విలువైన పుత్తడి దిగుమతి అయ్యినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వెండి పరిస్థితి కూడా దాదాపుగా ఇంతే.. వెండి దిగుమతులు 45శాతం తగ్గి సుమారు 4వేల 300 కోట్లకు పరిమితం అయ్యాయట.
అయితే బంగారం, వెండి దిగుమతులు భారీగా తగ్గడం దేశానికి చాలా మంచిది. అందుకే దేశ వాణిజ్య లోటు ఏప్రిల్ -జూన్ మధ్యకాలంలో 68వేల 400 కోట్లకు పరిమితమైంది. ఏడాదిక్రితం ఇదే కాలానికి వాణిజ్య లోటు 3లక్షలా 44వేల 700 కోట్లుగా ఉంది. సో..బంగారం దిగుమతులు తగ్గడం కూడా దేశానికి మంచిదే అన్నమాట.