అసలే అందమైన అమ్మాయి.. అందులో అనాథనంటూ జాలి గొలిపేలా మాట్లాడుతుంది.. ఎవరూ లేరు మీరే సర్వస్వం అంటూ మాయ చేస్తోంది.. ఆ మాయ మాటల్లో పడి పాపం.. ఎందరో కుర్రాళ్లు, మధ్య వయస్సకులు మోసపోతున్నారు. కేవలం మూడు నెలల్లోనే ఏకంగా ఏడుగురిని ఇలా బోల్తా కొట్టింటిన యువతి ఘటన ఇప్పుడు రాజస్థాన్, హర్యానాల్లో హాట్ టాపిక్ గా మారింది. అనాథనంటూ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడం.. ఫస్ట్‌ నైటే భర్తకు మత్తుమందు ఇచ్చి డబ్బు, నగలతో ఉడాయించడం ఆమె స్టయిల్.


అయితే.. పెళ్లి సంబంధం మాట్లాడుకోవడం.. పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత మోసం చేసి పారిపోవడం అంతా ఒక్కదాని వల్ల సాధ్యం కాదు కాబట్టి.. దీని కోసం ఓ ముఠానే రెడీ చేసుకుందీ భామ. ఆమె గ్రూపులో ఓ మ్యారేజ్ ఏజెంట్, నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు.. ఇలా ఓ ముఠానే మెయింటైన్ చేస్తూ మోసాలు చేస్తున్న యువతి చివరకు పోలీసులకు చిక్కింది.


ఇంతకీ ఈ ముఠా ఎలా పని చేసేదంటే.. పెళ్లికాని యువకులను, విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకోవాలనుకునే వారిని ఈ మాయలాడి టార్గెట్ చేసుకునేది. దీనికోసం సోషల్ మిడియాను, పెళ్లిళ్ల వెబ్ సైట్లను వాడుకునేది. అలాంటి వారిపై వలపు వల విసిరేది. మెల్లగా పెళ్లి చేసుకుందామని మాయ చేసేది. పెళ్లి సింపుల్‌గా కానిచ్చిన తర్వతా మొదటి రాత్రే భర్తకు మత్తుమందు మాత్రలు ఇచ్చేసేది. ఆ రాత్రే అందుబాటులో ఉన్న డబ్బు, నగలతో ఉడాయించేది.


ఇలా గత మూడు నెలల్లోనే ఈ ముఠా ఏడుగురిని లూఠీ చేసిందట. నాలుగో భర్తకు వచ్చిన అనుమానంతో ఈ వ్యవహారం గుట్టు రట్టయింది. నాలుగో భర్త మేలుకుని ఆలోచించి ఫిర్యాదు చేసేలోపే మరో మూడు పెళ్లిళ్లు చేసుకుందంటే.. ఈ అమ్మడి స్పీడ్‌ ఏ రేంజ్ లో ఉందో చూడండి. నాలుగో భర్త, ఏడో భర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఆ మాయలేడీని, ఆమె ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా ఎంత మందిని ఇలా మోసం చేసిందో మొత్తం కూపీ లాగుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: