ఎంఎం కీరవాణి తనయులు శ్రీ సింహ.. కాల భైరవ 'మత్తు వదలరా' సినిమాతో ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకొబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో సింహా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే గాయకుడిగా కొన్ని పాటలు పాడిన కాల భైరవ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా మారుతున్నాడు. ఈమధ్యే విడుదలైన 'మత్తు వదలరా' ట్రైలర్ ప్రేక్షకులందరినీ ఆకర్షించింది. ఈ సినిమా క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 25 న రిలీజ్ అవుతోంది. అన్నయ్య కొడుకుల సినిమా కావడంతో స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ సినిమా విషయంలో ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. 

 

ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ తో బిజీగా ఉన్నప్పటికీ డిసెంబర్ 25 న మాత్రం 'షూటింగ్ మానేస్తా మానేస్తా'.. అంటూ సినిమా చూస్తానని ట్విట్టర్ ద్వారా ఇదివరకే వెల్లడించారు జక్కన్న.  ఇదిలా ఉంటే రీసెంట్ గా 'మత్తు వదలరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమౌళి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ "భైరవ.. సింహా ఇద్దరూ ఇంట్లో పిల్లలు. ఇద్దరూ ఒకే సినిమాతో మీ ముందుకు రావడం మాకు ఒక ఎమోషనల్ అంశం. నేను సినిమా చూశాను. సినిమా చూస్తున్నంత సేపు స్వీటు, కారం ఒకేసారి తింటున్నట్టు అనిపించింది. ప్రతి సీన్లో సింహ ఎంత బాగున్నాడు.. ఎంత బాగున్నాడు అనుకున్నా.. ప్రతి సీన్లో భైరవ ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చాడు అనుకున్నా. అయితే కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు మన పిల్లలు కాబట్టి మనకు నచ్చుతుందా లేక జనాలకు కూడా ఇలాగే నచ్చుతుందా అనే టెన్షన్ ఉంది. 

 

రెండు తీపి, కారం లాగా ఉన్నాయి.  పిల్లలని ఆశీర్వదించండి.. లాంటి మాటలు చెప్పడం నాకు ఇష్టం లేదు.. మీకు నచ్చితే తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు.  నచ్చకపోతే ఎవరైనా తీసి పక్కన పెట్టేస్తారు. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేదేంటంటే.. మీరు దయచేసి మీ అభిప్రాయం నిజాయితీగా చెప్పండి. వాళ్లు చేసిన దాన్లో ఏవైనా లోటు పాట్లు ఉంటే అవి చెప్పండి. ఇలా చేస్తే మాకు నచ్చదు ఇలా నచ్చుతుంది అని చెప్పండి. ఇలాంటి ఫీడ్ బ్యాక్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను" అన్నారు. తన స్పీచ్ ని ముగిస్తూ సినిమాను తప్పకుండా చూడాలని ప్రేక్షకులను కోరారు. నిజాయితీగా జక్కన్న మాట అందరిని ఆకర్షించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: