స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, విజయ దేవరకొండ కలిసి ఓ మూవీలో కలిసి నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. "యాత్ర" ఫేం మహేష్ వీ రాఘవ్ వీళ్లిద్దరి కోసం ఓ సరికొత్త స్క్రిప్టు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కథ దాదాపు ఫైనల్ అయినట్లేనట. ఈ సినిమాను బన్నీ వాసు, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తారని టాక్ నడుస్తోంది. 2021 చివర్లో ఈ మల్టీ స్టారర్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందట. కాగా.. ప్రస్తుతం అల్లు అర్జున్.... లెక్కల మాస్టర్ సుకుమార్తో "పుష్ప" సినిమా చేస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలుసు కదా.
అయితే ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ పాత్రలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని ఖరారు చేశారు. అటు విజయ్ దేవరకొండ కూడా.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "లైగర్" సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం కూడా పాన్ ఇండియా మూవీగానే వస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత విజయ్, బన్నీ కాంబోలో సినిమా ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటనా రాలేదు.