భారతీయ చలన చిత్ర రంగంలో తన అందం, హావభావం, నటనతో కోట్ల హృదయాలు గెలుచుకున్న నటీమణి శ్రీదేవి. దుబాయ్ లో బంధువుల పెళ్లికి వెళ్లి అనుకోకుండా బాత్ రూమ్ టబ్ లో ప్రమాదానికి గురై మరణించిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై దుబాయ్ పోలీసులు మొదట అనుమానాలు వ్యక్తం చేసినా..తర్వాత క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారు. నిన్న రాత్రి ఆమె పార్థీవ దేహం ఇండియాకు చేరింది. ప్రస్తుతం సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైలోని సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్లో ఉంచారు. ఉదయం 9.30 గంటల సమయంలో ఆమె పార్థీవ దేహాన్ని అక్కడకి తీసుకురాగా.. బాలీవుడ్తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

పలువురు తెలుగు నటులు కూడా బోనీ కపూర్ కుటుంబానికి సానుభూతి తెలపడానికి ముంబై వెళ్లారు. శ్రీదేవి మరణ వార్త విని టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది..చిన్ననాటి నుంచి తెలుగు ఇండస్ట్రీలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి మూడు తరాల హీరోలతో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీదేవి, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది.
ఈ చిత్రంలో శ్రీదేవి నిజంగా దేవకన్యలా చూపించారు దర్శకులు. శ్రీదేవి దుబాయ్ లో మరణించారని వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా షాక్ చెందారు...బుధవారం ఉదయం ముంబై వెళ్లిన చిరంజీవి శ్రీదేవి పార్థీవ దేహానికి అంజలి ఘటించారు.
వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జగదేక వీరుడు - అతిలోక సుందరి సినిమా సూపర్ హిట్గా నిలవడంతోపాటు ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. ఆ చిత్రంలో దేవకన్య పాత్రలో నటించిన శ్రీదేవి.. ఆ పాత్ర కోసమే పుట్టిందా అనేంతలా మెప్పించిందని అతిలోక సుందరి నటనపై చిరు ప్రశంసలు గుప్పించారు.
