హీరో శర్వానంద్ సినిమాలు బాగుంటాయి. ఆయన నటన బాగుంటుంది. పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. డైలాగ్ డెలివరీ బాగుంటుంది. ఇదీ శర్వానంద్ కు ప్రేక్షకుల్లో ఉండే పేరు. కానీ ఆ అంచనాలు ఇప్పుడు తలకిందులవుతున్నాయి. ఆయనపై ప్రేక్షకులకు ఉండేకొద్దీ నమ్మకం పోతోంది. ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ ఫ్లాపుల బాట పడుతుంటే ఆయనకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎంత కష్టపడి సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు.  

శర్వానంద్‌కి జనాల్లో బెస్ట్‌ పెర్ఫామర్‌ అనే ఇమేజ్‌ ఉంది. ఎలాంటి కథకైనా న్యాయం చేస్తాడని మంచి ఒపీనియన్‌ ఉంది. కానీ సినిమా సినిమాకి ఈ ఆలోచనలు మారిపోతున్నాయి. వరుస ప్లాపులతో శర్వా డౌన్ అవుతోంటే, జనాల్లో కూడా నమ్మకం తగ్గిపోతోందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

శర్వానంద్ 'మహానుభావుడు' తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాడు. 'పడిపడి లేచే మనసు, రణరంగం' సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర బోల్తాపడితే, 'జాను, శ్రీకారం'కి పాజిటివ్ రివ్యూస్‌ వచ్చినా, వసూళ్లు రాలేదు. దీంతో శర్వానంద్ మార్కెట్‌లోనూ తేడాలొచ్చేశాయి.

శర్వానంద్‌ కంపల్సరీగా హిట్‌ కొడితేనే మార్కెట్‌లో నిలబడతాడు అనే టైమ్‌లో అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం' సినిమా చేశాడు. సిద్ధార్థ్, శర్వానంద్‌ హీరోలుగా నటించిన ఈ సినిమాకి జనాలు పెద్దగా కనెక్ట్ కాలేదు. పైగా 'రణరంగం' పోయాక కూడా మళ్లీ ఇలాంటి కథే చేయాలా అని విమర్శలు కూడా వస్తున్నాయి.

శర్వానంద్‌ ఫ్లాపుల నుంచి బయటపడకపోవడంతో స్టోరీ సెలక్షన్‌పై కామెంట్స్‌ వస్తున్నాయి. శర్వా కథలు ఎంచుకోవడంలో తడబడుతున్నాడని, ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు సినీ జనాలు. మరి ఇప్పుడు పైప్‌లైన్‌లో ఉన్న 'ఒకే ఒక జీవితం, ఆడవాళ్లు మీకు జోహార్లు'  సినిమాతో అయినా మళ్లీ ట్రాక్‌లోకి వస్తాడేమో చూడాలి. శర్వానంద్ కు ఆల్ ది బెస్ట్ చెబుదాం. వరుస ఫ్లాపుల నుండి త్వరగా బయటపడాలని కోరుకుందాం..




మరింత సమాచారం తెలుసుకోండి: