ప్రతి సినిమాకు మొదటి రోజు నెగెటివ్‌ వైబ్స్‌ సాధారణమని, కొంతమంది ఎప్పుడూ నెగెటివ్‌గా ఉంటారని తెలుగు సినీ నిర్మాత దిల్‌రాజు
 అన్నారు.
ప్రభాస్‌  కథానాయకుడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్‌ మూవీ 'ఆది పురుష్‌' . సీతగా కృతిసనన్‌, లంకేష్‌గా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. దసరా కానుకగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయగా, గురువారం హైదరాబాద్‌లో 3డీ టీజర్‌ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్‌, ఓం రౌత్‌, దిల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. ''ఆది పురుష్‌' టీజర్‌ ఎప్పుడు వస్తుందా? అని ప్రభాస్‌ అభిమానులే కాదు, నేనూ ఆసక్తిగా ఎదురు చూశా. టీజర్‌ రాగానే నేనూ మొదట ఫోన్‌లోనే చూశా. వెంటనే ప్రభాస్‌కు ఫోన్‌ చేస్తే, స్విచ్ఛాఫ్‌ వచ్చింది. 'అమేజింగ్‌' అంటూ వాయిస్‌ మెసేజ్‌ పెట్టా. బయట నుంచి ఇంటికి వెళ్లేలోపు టీజర్‌ రెస్పాన్స్‌ కనుక్కొందామని నలుగురైదుగురికి చేస్తే, 'ట్రోలింగ్‌ చేస్తున్నారు సర్‌' అని చెప్పారు. 'బాహుబలి-1' మొదటిసారి చూసి బయటకు వచ్చినప్పుడు అందరూ ట్రోలింగ్‌ చేశారు. శివలింగాన్ని ఎత్తుకుని ప్రభాస్‌ వచ్చే ఫొటోకు జండూబామ్‌ పెట్టి పోస్టులు చేశారు. 'సినిమా సూపర్‌ హిట్‌' అని ప్రభాస్‌కు అప్పుడే చెప్పా. ఇలాంటి సినిమాలు థియేటర్‌లోనే చూడాలి. సెల్‌ఫోన్‌లో చూసి సినిమాను అంచనా వేయలేం. వీఎఫ్‌ఎక్స్‌ సినిమాలను థియేటర్‌లో పూర్తి జనాలతో చూస్తే అర్థమవుతుంది. 'ఆదిపురుష్‌' కూడా అలాంటి సినిమానే. ఇప్పుడు 3డీలో విజువల్స్‌ చూస్తే చాలా బాగుంది''

వాళ్లు తీసుకున్న కథా నేపథ్యం కూడా అలాంటిది. రామాయణం నుంచి ఐడియా తీసుకొని రాముడు, సీత, రావణుడి పాత్రలను తీర్చిదిద్దారు. దీనిపైన కూడా చర్చలు అవసరమా? 'రావణుడు ఇలా ఉంటాడా? పక్షిమీద ఎందుకు వస్తాడు? పూల రథంపై రావాలి కదా?' అంటున్నారు. నేటి తరం ప్రేక్షకులకు ఏం చూపించాలో అలా తీశారు. ఈ సినిమా జనవరి 12న భారీ విజయాన్ని అందుకుంటుంది. ఓం రౌత్‌ 'ఆదిపురుష్‌' తీస్తున్నప్పుడు 'తానాజీ' చూసి ఆశ్యర్యపోయా. 'ఆది పురుష్‌' ఒక మేజిక్‌ ఫిల్మ్‌ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎవరూ నిరుత్సాహ పడరు. ప్రతి సినిమాకు మొదటి రోజు నెగెటివ్‌ వైబ్స్‌ సాధారణం. సినిమా చూసేవాళ్లలో అత్యధికమంది ఏదో మైండ్‌లో పెట్టుకుని వచ్చి సినిమా చూడరు. కొంతమంది ఎప్పుడూ నెగెటివ్‌గా ఉంటారు. ప్రతి సినిమాకూ ఇలాంటి వాళ్లు ఉంటారు. ఒక కామన్‌ ప్రేక్షకుడికి నచ్చితే చాలు. 'పొన్నియిన్‌ సెల్వన్‌-1' తమిళనాడులో రికార్డులు సృష్టిస్తోంది. విజువల్‌ వండర్‌తో వచ్చిన చిత్రాలను ప్రేక్షకులు విజయవంతం చేస్తారు. ఇటీవల 'బింబిసార', 'కార్తికేయ2' చిత్రాలు మంచి విజయాలను నమోదు చేశాయి. ప్రభాస్‌లాంటి స్టార్‌ ఉన్నప్పుడు ఈ సినిమా ఆగే ప్రసక్తే లేదు. బ్లాక్‌ బస్టర్ హిట్ అవుతుంది'' అని దిల్‌రాజు ట్రోలర్స్‌కు గట్టిగానే సమాధానం ఇచ్చారు.
అనంతరం దర్శకుడు ఓం రౌత్‌ మాట్లాడుతూ.. ''నేను చెబుదామనుకున్న విషయాలన్నీ దిల్‌రాజు చెప్పేశారు. మా సినిమాకు తెలుగు ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలి'' అని అన్నారు. ''ఆది పురుష్‌' నేను ఫస్ట్‌ టైమ్‌3డీలో చూసినప్పుడు చిన్న పిల్లాడిలా అయిపోయా. నన్ను నేను 3డీ చూసుకుంటే భలే అనిపించింది. ఫ్యాన్స్‌ కోసం రేపు 60 థియేటర్‌లలో ప్రదర్శిస్తాం. అభిమానులే మాకు ముఖ్యం. ఈ టెక్నాలజీతో ఇండియాలో మొదటిసారి సినిమా చేస్తున్నాం. కొద్దివారాల్లోనే అద్భుతమైన కంటెంట్‌తో మీ ముందుకు వస్తాం'' అని ప్రభాస్‌ అన్నారు. 'ఆది పురుష్‌' 3డీ టీజర్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉందని, సినిమాను కూడా అదే ఫార్మాట్‌లో తీసుకొస్తున్నామని నిర్మాత భూషణ్‌కుమార్‌ అన్నారు. ప్రభాస్‌ నటన, ఓం రౌత్‌ టేకింగ్‌ తప్పకుండా అలరిస్తుందని తెలిపారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: