ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ తన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మూడో సినిమా కీడా కోలా.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ మూడవ తేదీన విడుదలకు సిద్ధం కానుంది. ఇప్పటికే పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇప్పుడు ఈ సినిమాతో వస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని భారీగా పెంచేసాయి. ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

ఇక ఈ సినిమాలో నటీనటులుగా హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, 30 వెడ్స్ 21 సిరీస్ ఫేమ్ చైతన్య రావు, రాగ్ మయూర్, రవీంద్ర విజయ్, విష్ణు పలువురు ముఖ్యపాత్రలలో కనిపిస్తున్నారు.  అంతేకాదు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా ఈ సినిమాలో ఒక చిన్న రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తూ ఉండగా.. ఇటీవల చిత్ర బృందం రానాతో కలిసి చేసిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు తరుణ్ భాస్కర్.. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. బ్రహ్మానందం గారు చేసిన పాత్రకి మొదట అల్లు అరవింద్ గారిని అనుకున్నాము.

ఆయన గతంలో పలు సినిమాలలో కమెడియన్ గా మెప్పించారు.  అందుకే ఆయనను తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. అందుకే  వెళ్లి అరవింద్ గారిని తమ సినిమాలో నటించమని అడిగితే సింపుల్ గా నవ్వేసి నో చెప్పారు. ఆ తర్వాతే ఆ పాత్రకు బ్రహ్మానందం గారిని తీసుకున్నాము అంటూ తెలిపారు . ఇకపోతే బ్రహ్మానందం ప్లేస్ లో నిజంగా అల్లు అరవింద్ ఆ పాత్రను ఒప్పుకొని ఉంటే కొత్తగా ఉండేదని ఆయన కూడా రీఎంట్రీ ఇచ్చినట్టు ఉండేది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే బ్రహ్మానందాన్ని మించిన కామిడీ ఎవరు చేస్తారనే కామెంట్లు కూడా మరో పక్క వినిపిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: