తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ నటుడు, విలన్,హీరో రానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రానా తెలుగులో పలు సినిమాలలో నటించినప్పటికీ పూర్తిస్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా బాహుబలి.ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించి ప్రపంచస్థాయి గుర్తింపుతెచ్చుకున్నారు రానా దగ్గుబాటి. ఇకపోతే రానా తెలుగులో చివరగా రామానాయుడు అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రానా మారుమోగిపోతోంది. అసలేం జరిగిందంటే.గుర్గావ్‌లో జరిగిన సినాప్స్‌ వేడుకలో పాల్గొన్న రానా తాను ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల గురించి మాట్లాడారు. నా ఆరోగ్యం గురించి ఎవరైనా అడగాలి అనుకుంటే కన్ను, కిడ్నీ దానం చేసే ఆలోచన ఉంటే అడగండి.లేదంటే అడిగే అవసరం లేదు. మనిషి చివరిదశలో ఉన్నప్పుడే జీవితాన్ని విభిన్నంగా చూస్తాడు. ఆ క్షణం ఆలోచన విధానం మారిపోతుంది. ఇందుకు నేను మినహాయింపు కాదు.

ఒక ఆసుపత్రికి వెళ్లినపుడు అక్కడే నాకున్న అనారోగ్య సమస్యలు  తెలిశాయి. ఆ సమయంలోనే నన్ను నేను భిన్నంగా చూడడం మొదలుపెట్టాను. సమస్యలు ఎదురైనప్పుడే చాలా విషయాలు తెలుస్తాయి. అన్నీ ఒకేలా ఉండవని గ్రహించాను.అప్పటివరకు నన్ను ముందుకి నడిపిస్తున్నాయి అనుకున్నవి మధ్యలోనే వదిలేశాయి అని రానా వెల్లడించారు.బాహుబలి కోసం నేను పెరిగిన బరువు అనారోగ్యం వల్ల తగ్గాను. అప్పుడు అందరూ ఆరోగ్యంగానే ఉన్నావా అంటూ ప్రశ్నించేవారు. వారికి సమాధానం చెప్పాలను కోలేదు. వీటి నుంచి కోలుకున్న తర్వాత అరణ్య షూటింగ్‌లో పాల్గొన్నాను.సంవత్సరం పాటు అడవిలో నివసించే అవకాశం వచ్చింది. ఏనుగులతో కలిసి నటించాను. ఆరోగ్యం బాగా లేకున్నా అక్కడ నన్ను పట్టించుకునేవారు ఎవరూ లేరు. అప్పుడు ఆ నిశ్శబ్ద వాతావరణం ఎంతో ఉపయోగపడింది. ప్రకృతికి మించిన వైద్యం లేదని అర్థమైంది అని రానా చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా రానా చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: