యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ వివాదాలకు సైతం దూరంగా ఉంటారు.అయితే తన ఇంటి స్థలం విషయంలో వివాదం నెలకొనడంతో తారక్ తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని సమాచారం అందుతోంది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్న 681 చదరపు గజాల స్థలం విషయంలో ఈ వివాదం తలెత్తిందని భోగట్టా.జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో సుంకు గీతా లక్ష్మి నుండి 2003లో నటుడు రూ. 36 లక్షలకు ఒక స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ సమయంలో సుంకు గీత ఆ భూమి పత్రాలను తనఖా పెట్టి చెన్నైకి చెందిన ఉపాసన ఫైనాన్స్ లిమిటెడ్ నుండి రుణం పొందినందున జూనియర్ ఎన్టీఆర్ లోన్‌ను క్లియర్ చేసి టైటిల్ పత్రాలను సొంతం చేసుకున్నారు. స్థలాన్ని కొనుగోలు చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ విలాసవంతమైన ఇంటిని కూడా నిర్మించారు. చట్టప్రకారం అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఇంటి నిర్మాణం చేపట్టినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ చెబుతున్నారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేయడానికి ముందే.. 1996లోనే ఆ స్థలాన్ని తమ వద్ద తనాఖా పెట్టి రుణాలు పొందారంటూ ఎస్‌బీఐ, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండ్‌సఇండ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంకులు సర్ఫేసీ యాక్ట్‌ కింద డీఆర్‌టీని ఆశ్రయించాయి. 1996లోనే సుంకు గీతకు అప్పుగా ఇచ్చిన డబ్బును గ్రహించడానికి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని వేలం వేయడానికి బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. బ్యాంకుల నోటీసులను సవాల్‌ చేస్తూ తొలుత డీఆర్‌టీలో ఎన్టీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ తన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) కె రాజేశ్వరరావు ద్వారా డీఆర్‌టీ ముందు వాదించారు. పోలీసుల విచారణ ఇది తనపై జరిగిన మోసం అని నిశ్చయాత్మకంగా రుజువు చేసిందని, పోలీసులు తనకు స్థలం విక్రయించినవారిపై ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారని వాదించారు. ఆరు బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు.. వారి తప్పిదం నుంచి బయటపడేందుకు తన ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.అయితే డీఆర్టీలో వాదనలు ముగిసిన అనంతరం.. ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులుంటాయంటూ తీర్పు ఇచ్చింది. 1996 నుంచి ఆస్తిపై తాత్కాలిక హక్కును కలిగి ఉన్నందున బ్యాంకుల క్లెయిమ్‌లకు ప్రాధాన్యత ఉందని డీఆర్‌టీ పేర్కొంది. మరోవైపు ఇందుకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. సుంకు గీత బ్యాంకు అధికారులతో కలిసి నటుడిని మోసం చేసిందని, అదే ఆస్తి పత్రాలను రుణాలు పొందేందుకు వివిధ బ్యాంకుల్లో తాకట్టు పెట్టారని నిర్ధారించారు. ప్లాట్‌ని జూనియర్ ఎన్టీఆర్‌కు విక్రయించే ముందు ఈ వాస్తవాన్ని దాచిపెట్టారని పోలీసులు తెలిపారు.

ఇక, డీఆర్‌టీ తీర్పుపై ఎన్టీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్టీఆర్ తన కోర్టు కేసులను డీల్ చేయడానికి నియమించుకున్న జీపీఏ రాజేశ్వరరావు ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ జే శ్రీనివాసరావులతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గాడి ప్రవీణ్ కుమార్.. డీఆర్‌టీ ఆర్డర్‌పై ఢిల్లీలోని అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేసుకునే అవకాశం పిటిషనర్‌కు (జూనియర్ ఎన్టీఆర్) ఉందని తెలిపారు. అలాంటప్పుడు హైకోర్టుకు రాలేరని అన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. తమ వాదనలను రుజువు చేసేందుకు కొన్ని రికార్డులను అందజేస్తామని పేర్కొన్నారు. తదుపరి విచారణకు వెకేషన్ బెంచ్ ముందు ఈ అంశాన్ని పోస్ట్ చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అయితే ఈ విషయాన్ని తదుపరి వెకేషన్ ముందు పోస్టు చేసందుకు ధర్మాసనం నిరాకరించింది. విచారణను జూన్‌ 6కు వాయిదా వేసింది.ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాల డాక్యుమెంట్లను జూన్‌ 3లోగా అందజేయాలని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: