దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి – సూపర్‌ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న మహత్తర చిత్రం ‘వారణాసి’ హాలీవుడ్‌ స్థాయి నిర్మాణ విలువలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. శనివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఘనంగా నిర్వహించిన ఈవెంట్‌లో సినిమా టైటిల్‌తో పాటు ప్రత్యేక గ్లింప్స్ వీడియోను చిత్రం బృందం విడుదల చేసింది. ఈ వేడుకలో మహేశ్ బాబు చెప్పిన మాటలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ—“మిమ్మల్ని కలుసుకుని చాలా రోజులైంది.  .ఇంత పెద్ద ఈవెంట్‌లో అందరినీ కలవడం ఎంతో ఆనందంగా ఉంది. నా నాన్నగారు కృష్ణ గారు ఎప్పుడూ నాతో ‘నువ్వు ఒక పౌరాణిక పాత్ర చేస్తే చూడాలని ఉంది’ అని ఆశపడేవారు. ఆయన మాట నేనప్పుడు వినలేదు. కానీ ఇప్పుడు… ఎక్కడో ఆయన నా మాటలు వింటూ, ఆశీస్సులు ఇస్తూ ఉన్నారనే అనుభూతి కలుగుతోంది” అన్నారు.


సినిమా గురించి మాట్లాడుతూ ఆయన మరింత భావోద్వేగంతో చెప్పారు—“వారణాసి నా డ్రీమ్ ప్రాజెక్ట్. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే సినిమా ఇది. ఈ ప్రాజెక్ట్ కోసమే నా శక్తిని పూర్తిగా వినియోగిస్తాను. అందరూ గర్వపడేలా, ముఖ్యంగా నా దర్శకుడు రాజమౌళి గారే గర్వపడేలా నేను పని చేస్తాను. ఈ సినిమా విడుదలైనప్పుడు యావత్ దేశం గర్వపడేలా ‘వారణాసి’ నిలుస్తుంది” అని తెలిపారు.అయితే మహేశ్ బాబు ఈసారి స్టేజ్‌పై మాట్లాడిన తీరు చాలామందిని ఆకట్టుకుంది… అయితే కొందరిని ఆలోచింపజేసింది కూడా. సాధారణంగా మహేశ్ బాబు స్పీచ్ అంటే చలాకీతనం, సరదా జోకులు, పంచులు–ఇవి తప్పవు. కానీ ఈ ఈవెంట్‌లో మాత్రం ఆయన స్వరం కొద్దిగా వణికినట్టూ, మాటల్లో తడబడినట్టూ కనిపించిందని ప్రేక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు. గ్లింప్స్ వీడియో ఆలస్యంగా రావడం… రాజమౌళి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకోవడం… ఈ రెండు విషయాలు మహేశ్ మనసుపై ఒత్తిడిని కలిగించి ఉండొచ్చని ఇండస్ట్రీ టాక్.


ఈ చిత్రంలో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, కార్తికేయ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ‘వారణాసి’, మహేష్ బాబు కెరీర్‌లోనే కాదు—భారతీయ సినీ పరిశ్రమలో కొత్త ప్రమాణాలను సృష్టించే చిత్రంగా నిలుస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: