టాలీవుడ్‌లో ఇటీవల పెద్ద సంచలనంగా మారిన ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు నేపథ్యంలో ఇండస్ట్రీ మొత్తం స్పందిస్తోంది. సినిమా పైరసీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ రోజురోజుకు మరింత జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఫిలిం చాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సి. కల్యాణ్, పైరసీ వల్ల సినీ పరిశ్రమ ఎన్నో కోట్లు నష్టపోతుందని, వందలాది మంది శ్రమ పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. “ఒక సినిమా వెనుక వందలాది మంది కష్టపడతారు. అలాంటి కష్టాన్ని దోచుకుంటున్న వారికి కఠిన శిక్షలు తప్పకుండా ఉండాలి. ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి! నేను కడుపుమంటతో, బాధతో ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఇలా ఒకసారి కఠినంగా చర్య తీసుకుంటే… ఇకపై మరెవరూ ఇలాంటి పనులకు పాల్పడడానికి భయపడతారు,” అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.


అయితే సి. కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత వివాదానికి దారి తీసాయి. తాజాగా ఈ కామెంట్స్‌కి స్పందించిన ఐ బొమ్మ రవి తండ్రి అప్పారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నా కొడుకును ఎన్కౌంటర్ చేయాలని చెప్పిన వారు… ఒకసారి అలాంటి బాధ మన ఇంటి మీద పడితే ఏమవుతుందో తెలుసుకుంటారు. సినిమాలు విషయం వస్తే జనం చూస్తారే కానీ… అందరూ పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి థియేటర్లకు వెళ్లలేరు. నేను కూడా 45 పైసల టికెట్‌తోనే సినిమాలు చూడటం మొదలు పెట్టాను. ఇప్పుడు సినిమా టికెట్ రేట్లు ఆకాశాన్నంటాయి. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీయడం వాళ్ల విషయం… కానీ అందుకు నా కొడుకును చంపాలని చెప్పడం సరైంది కాదు,” అంటూ భావోద్వేగంతో స్పందించారు.



అప్పారావు ఇంకా మాట్లాడుతూ… “నా కొడుకు పక్షాన నిలబడే న్యాయవాదులకు నేను ఆర్థిక సహాయం చేస్తాను. ఆయన చేసిన తప్పు ఏమిటో ముందు నిరూపించాలి. సోషల్ మీడియాలో నా కొడుకును మొదటి నుంచీ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. వారు చూపుతున్న ప్రేమ నాకు బలం ఇస్తోంది,” అంటూ పరోక్షకంగా రవికిసపోర్ట్ చేశారు. ప్రస్తుతం రవి తండ్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు రవి అభిమానులు కూడా అప్పారావును సపోర్ట్ చేస్తూ, “రవి చేసిన తప్పు ఏమిటో ముందుగా చెప్పండి… వెంటనే ఎన్కౌంటర్లు, కఠిన శిక్షలు అంటూ తీర్పులు ఇవ్వడం సరైంది కాదు,” అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు సినీ పరిశ్రమ పైరసీ నిర్మూలన కోసం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతుండగా… మరోవైపు రవి కుటుంబం తమ వైపు వాదనలు వినిపిస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారి, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: