తెలంగాణలో ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ‘రైతుబంధు’. పథకం కింద గ్రామాల్లో భూములున్న రైతులందరికీ ప్రభుత్వం ఎకరానికి రూ.4వేల చొప్పున సాయం అందిస్తోంది. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని డబ్బులు వారికి చెందుతాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ పథకానికి ఆకర్షితులైన దాతలు తమ చెక్కులు వాపస్ ఇస్తున్నారు. అంతే కాదు రైతులకు తమకు తోచినంత సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నట్లు ఆ మద్య మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనిలో భాగంగానే హరీష్ శంకర్కు కూడా సాయం అందింది.
మహబూబ్ నగర్ జిల్లా కమ్మదనం గ్రామంలో హరీష్ శంకర్కు కొంత భూమి ఉంది. దీనికి గాను ప్రభుత్వం నుంచి రైతుబంధు సాయం అందింది. ప్రభుత్వం అందజేసిన చెక్ను హరీష్ శంకర్ తిరిగిచ్చేశారు. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య సమక్షంలో గ్రామ సర్పంచ్కు చెక్ను తిరిగిచ్చిన హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘నాకు ఉన్న పొలానికి కూడా రైతుబంధు పథకం కింద కొంత మొత్తం వచ్చింది.
ఎవరన్నా పేద రైతు సహాయార్థం ఇది వాడితే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మొత్తానికి మరికొంత జోడించి నేను సర్పంచ్ గారికి బాధ్యతాయుతంగా అందచేస్తున్నాను’ అని హరీష్ శంకర్ చెప్పారు. తెలంగాణ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం దేశంలో అందరూ ఆదర్శంగా తీసుకోవాలని..ఇంత గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టిన ఆయనకు కృతజ్ఞతలు అని అన్నారు.Rటీవల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు తమ పొలాలకు వచ్చిన చెక్కులను రైతు సమన్వయ సమితికి విరాళంగా ఇచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా తనకు వచ్చిన రైతుబంధు సాయాన్ని తిరిగిచ్చారు.