బాలకృష్ణ కెరీర్లో బెస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను. అందులో ఎలాంటి సందేహం లేదు. సింహా, లెజెండ్ వంటి హిట్స్ ఇచ్చాడు. ఈ దర్శకుడితో మూడో సినిమా చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వలన వాయిదా పడింది. బాలకృష్ణకు రెండు సూపర్ హిట్స్ అందించిన బోయపాటిపై టాలీవుడ్ క్రిటిక్స్ రైటర్ కత్తి మహేష్ కత్తులు దూస్తున్నాడు. బాణాలు ఎక్కుపెడుతున్నాడు.
గతంలో పవన్ కళ్యాణ్ పైన, ఆయన ఫ్యాన్ పైనా వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి వచ్చాడు. ఆ తరువాత మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఏకంగా నగర బహిష్కరణ అయ్యాడు కత్తి. ఎలాగోలా తిరిగి హైదరాబాద్ చేరుకొని కొన్ని రోజులు కామ్ గా ఉన్నాడు. అంతా సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో తిరిగి సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు.
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు బోయపాటి టీం మీద తీవ్ర ఆరోపణల్ని సంధించారు. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫేస్ బుక్ లో తాజాగా వరుస పోస్టులు పెడుతున్న ఆయన, దర్శకుడు బోయపాటి టీమ్ లో కొందరు తనను ట్రోల్ చేస్తున్నట్లుగా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. అక్కడితో ఆగలేదు.. పనిలో పనిగా టిడిపిపై కూడా అస్త్రాలు ఎక్కుపెట్టి విమర్శలు సంధించాడు.
కొందరు పెయిడ్ తెలుగుదేశం సోషల్ మీడియా యోధులు ఓటమి తర్వాత సైలెంట్ గా దుకాణం సర్దేసుకున్నారని.. మరికొందరు మాత్రం ఆ ట్రోలింగ్ చేయటానికి అలవాటు పడ్డ వీరులు మాత్రం అదే రీతిలో ట్రోల్స్ చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. గతంలో సినిమాల గురించి వేరుగా, రాజకీయాల గురించి వేరుగా విమర్శలు చేసిన కత్తి ఇప్పుడు రెండింటిపై ఏక కాలంలో ఇలా విమర్శలు చేయడం విశేషం.