వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామకు చెందిన తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆయన చిన్నప్పుడు బీబీపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాబ్యాసం చేశారు. ఆయన చదువుకున్న పాఠశాల ఎప్పుడో దశాబ్దాల క్రితం నిర్మించింది. ప్రస్తుతం ఆ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం హైదరాబాద్లో ఉన్న సుభాష్ రెడ్డికి తెలిసింది.
అంతే.. తన పాఠశాలకు ఆధునిక వసతులతో కూడిన భవనం నిర్మించాలనుకున్నారు. జీ+1 పద్ధతిలో భారీ భవనం డిజైన్ చేయించి కట్టించారు. ఇప్పుడు తాను చదువుకున్న పాఠశాల స్థానంలో కార్పొరేట్ స్థాయిలో భవంతి నిర్మించారు. ఇది చూస్తే ప్రభుత్వ పాఠశాల భవనమేనా అని ఆశ్చర్యపోయేలా నిర్మించారు. ఈ నిర్మాణంలో మొత్తం 36 గదులు ఉన్నాయి. కేవలం బిల్డింగ్ కట్టివ్వడమే కాదు.. డిజిటల్ తరగతులు, సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, మూత్రశాలలు ఏర్పాటు చేశారు.
బడిలో తాగునీరు సౌకర్యం , ఉపాధ్యాయులకు విశ్రాంతి గదులు.. ఇలా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయించారు. ఇప్పుడు ఈ హైస్కూల్లో 650 మంది వరకూ చదువుతున్నారు. తన చిన్ననాటి బడి కోసం ఏకంగా రూ. 6 కోట్లు ఖర్చు చేసిన సుభాష్ రెడ్డిగారిని అభినందించకుండా ఉండగలమా..! ఇలా తాము చదువుకున్న పాఠశాలలను ఇప్పుడు చాలా మంది పూర్వ విద్యార్థులు అభివృద్ధి చేయిస్తున్నారు. ఇదో మంచి పరిణామం. ఈ స్ఫూర్తితో విద్యాలయాలు మళ్లీ కళకళలాడతాయి.