వివేకా హత్యకేసులో పులివెందులకు చెందిన సునీల్ కుమార్ యాదవ్ను సీబీఐ బృందం అనేక సార్లు విచారించింది. కీలక సమాచారం సేకరించింది. సునీల్ కుమార్ యాదవ్ను అరెస్ట్ చేసి కోర్టులో కూడా సీబీఐ హాజరు పరిచింది. ఆ తర్వాత పులివెందుల ప్రాంతానికే చెందిన ఉమాశంకర్ రెడ్డిపై సీబీఐ ఫోకస్ పెట్టింది. విచారణలో ఉమాశంకర్ రెడ్డి పేరును సునీల్ కుమార్ యాదవ్ వెల్లడించినట్టు తెలుస్తోంది. హత్య కేసులో ఉమాశంకర్ పాత్ర ఉన్నట్టు వాంగ్మూలంలో వివేకా డ్రైవర్ దస్తగిరి కూడా చెప్పినట్టు సమాచారం. దీంతో ఉమాశంకర్ రెడ్డిని సీబీఐ అనేకసార్లు విచారించింది. రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచింది.
వివేకా హత్య కేసులో సునీల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి పాత్ర ఉన్నట్టు సీబీఐ నిర్ధారించుకుంది. ఇద్దరి పేర్లను రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచింది. కేసును ఓ కొలిక్కి తెచ్చేందుకు ఉమాశంకర్ను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని ... పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు కస్టడీ పిటిషన్ వేశారు. ఓవైపు వాంగ్మూలాలు..మరోవైపు అరెస్ట్లు..నార్కో ఎనాలిసిస్ పరీక్షలు చూస్తుంటే..సీబీఐ ఆల్రెడీ కేసును ఛేదించి ఉంటుందనే చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే అరెస్ట్ల పర్వం కొనసాగిస్తోందని అంటున్నారు. త్వరలోనే కేసును క్లోజ్ చేసే అవకాశం ఉందని సమాచారం.