పవన్ కల్యాణ్ పై ఇటీవల కాలంలో మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఆమధ్య ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారంలో కూడా రోజా పవన్ పై విమర్శలు చేశారు. తాజాగా మరోసారి ఆమె పవన్ పై విరుచుకుపడ్డారు. పవన్, లోకేష్ ని లేపడానికి జాకీలు వాడుతున్నారని, అయినా జాకీలు విరిగిపోతున్నాయి కానీ పవన్, లోకేష్ లేవలేకపోతున్నారని సెటైర్లు వేశారు. చంద్రబాబుపై కూడా ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్రమోదీ. అల్లూరి విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగులో ప్రసంగించి అందర్నీ ఆశ్చర్యపరిచారు మోదీ. తెలుగువీరలేవరా.. దీక్ష బూని సాగరా.. అంటూ ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగించి ఆకట్టుకున్నారు. అల్లూరి జీవితం భారతీయులందరికీ స్ఫూర్తినిచ్చిందని చెప్పారు నరేంద్ర మోదీ. స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి పాత్ర ఎన్నదగినదని చెప్పారాయన. భవిష్యత్ తరాలు ఆయన గురించి తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. భీమవరంలో ప్రధాని నరేంద్రమోదీ సభ విజయవంతం అయిందని, దీంతో భీమ్లా నాయక్ బిగుసుకుపోయారని, చంద్రబాబు నీరుగారిపోయారని అన్నారు రోజా. గతంలో పవన్ కల్యాణ్ భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇప్పుడు అక్కడికే మోదీ వచ్చారు. కానీ పవన్ కి ఆహ్వానం లేదు. మరోవైపు చంద్రబాబుకి ఆహ్వానం ఉన్నా కూడా ఆయన వెళ్లలేదు. దీంతో వీరిద్దరిపై ఇలా సెటైర్లు పేల్చారు మంత్రి రోజా.

భీమవరం కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు. పర్యాటక శాఖ మంత్రిగా రోజా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీతో వేదిక పంచుకున్నారు. అనంతరం ఆమె తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం జగన్నాథపురంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ మార్గాని భరత్ కూడా రోజాతో పాటు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ పై సెటైర్లు వేశారు. మోదీ కార్యక్రమం ప్రపంచమంతా చూసిందని, దేశం గర్వించదగ్గ విధంగా అల్లూరి విగ్రహావిష్కరణ జరిగిందని చెప్పారు రోజా. మోదీ, జగన్ మధ్య ఉన్న అభిమానాన్ని చూసి భీమ్లా నాయక్ బిగుసుకుపోయారని, చంద్రబాబు నీరుగారిపోయారని ఎద్దేవా చేశారు రోజా.

మరింత సమాచారం తెలుసుకోండి: