హై కోర్టు సూచనలను
కేసియార్ తిరస్కరించటం ద్వారా పెద్ద షాకే ఇచ్చారు. ఆర్టీసీ సమ్మె విషయంలో మెరుగైన
పరిష్కారాన్ని కనుక్కునేందుకు హై కోర్టు ముగ్గురు రిటైర్డ్ సుప్రింకోర్టు జడ్జిలతో
కమిటి వేస్తామని సూచించింది. ఇందుకు ప్రభుత్వం అభిప్రాయమేంటో చెప్పాలని కోరింది.
అయితే కోర్టు సూచనను కేసియార్ తిరస్కరించారు.
హై కోర్టు సూచించినట్లుగా ముగ్గురు జడ్జీలతో కమిటి అవసరం లేదని తేల్చి చెప్పేశారు. కోర్టు సూచనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవటం లేదని కూడా స్పష్టం చేశారు. తాజాగా కేసియార్ వైఖరిని గమనిస్తే ఆర్టీసి సమ్మె పరిష్కారం విషయంలో ప్రతిష్టంభన కంటిన్యు అయ్యేట్లే ఉంది. ఎందుకంటే తాను చెప్పిన మాటే వేదమని, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళని కేసియార్ మొదటినుండి వాదిస్తున్నారు.
త్రిసభ కమిటి విషయంలో కేసియార్ వైఖరి ఏమిటో స్పష్టమైపోయింది కాబట్టి కోర్టు కూడా కమిటి ఏర్పాటు విషయంలో ఏమీ చేయలేక చేతులెత్తేసింది. కమిటి ఏర్పాటును కార్మిక సంఘాల నేతలు స్వాగతించినా కేసియార్ అంగీకరించకపోవటంతో కోర్టు ఇక చేయగలిగేది కూడా ఏమీ లేదనే అనిపిస్తోంది.
పైగా కార్మికశాఖ నిబంధనల ప్రకారం కార్మికులు, ఉద్యోగులందరినీ వెంటనే డిస్మిస్ చేయాలని వాదించటం విచిత్రంగా ఉంది. సమ్మె చేస్తున్న కార్మికులు, ఉద్యోగులు అసలు కార్మిక చట్టాలను పట్టించుకోవటం లేదంటూ ప్రభుత్వం ఎదురుదాడి మొదలుపెట్టింది.
తన మాటను కాదని కార్మికులు, ఉద్యోగులు సమ్మెలోకి దిగటాన్ని కేసియార్ జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా వారికి రాజకీయపార్టీలు, విద్యార్ధి సంఘాలు, ప్రజా సంఘాలు, టిఎన్జీవోలు అందరూ మద్దతు తెలపటంతో కేసియార్ అహం దెబ్బతిన్నది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇపుడు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలను సమైక్య రాష్ట్రంలో కేసియారే పెంచి పోషించారు.
బహుశా కార్మిక సంఘాలంటే తనింట్లోని సిండికేట్ బ్యాంకు సింబల్ గా ఉండాలని కోరుకుంటున్నట్లున్నారు. అయితే యూనియన్లు తనకు ఎదురు తిరిగేటప్పటికి కేసియార్ తట్టుకోలేకపోతున్నారు. అందుకనే ఉద్యోగులందరినీ డిస్మిస్ చేసినట్లు పిచ్చి ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా కోర్టు సూచనలను కూడా పట్టించుకోకపోవటంతో రేపు ఏం జరుగుతుందో చూడాల్సిందే.