చంద్రబాబునాయుడు పదే పదే
తప్పులు చేస్తున్నారు. అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారాజ్యంగా వ్యవహరించిన చంద్రబాబు
ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తన పద్దతిని మార్చుకోలేదు. రాష్ట్రంలో జగన్మోహన్
రెడ్డి పరిపాలన గురించి పార్లమెంటులో చర్చించాలని
ఎంపిలను ఆదేశించటమే విచిత్రంగా ఉంది. ఒక
రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన గురించి చర్చించటానికేనా పార్లమెంటున్నది ?
అసలు పార్లమెంటులో టిడిపికున్న ఎంపిలెందరు ? లోక్ సభలో ముగ్గురు, రాజ్యసభలో ఇద్దరు. ఉన్నదే ఐదుమంది ఎంపిలైతే చంద్రబాబేమో తనకు 50 మందున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. తాజాగా ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆశ్చర్యమేస్తోంది. స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై పార్లమెంటులో ప్రస్తావిస్తారట.
ఇరిగేషన్ ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్, ఇసుక కొరత లాంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తటం ద్వారా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాలని డిసైడ్ చేయటమే విచిత్రంగా ఉంది. రివర్స్ టెండరింగ్, ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టటం లాంటి అంశాలు అధికారపార్టీ ఇష్టం. ఇష్టముంటే మద్దతు తెలపటం లేకపోతే వ్యతిరేకించటం ప్రతిపక్షానికున్న హక్కు. అంతే కానీ ఆ విషయాలను కూడా పార్లమెంటులో ప్రస్తావిస్తామంటే వినటానికే విచిత్రంగా ఉంటుంది.
అంటే ఎటువంటి అంశాలను ఎక్కడ ప్రస్తావించాలనే విచక్షణ కూడా చంద్రబాబు కోల్పోయినట్లు అర్ధమవుతోంది. లేకపోతే రాష్ట్రంలోనో లేకపోతే అసెంబ్లీలో మాట్లాడాల్సిన అంశాలను ప్రస్తావిస్తామంటే కేంద్రం ఒప్పుకుంటుందా ? ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే జగన్ పైన తనకున్న వ్యతిరేకతను దేశవ్యాప్తంగా చాటాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నట్లున్నారు.
అందుకే ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంకో జోకేమిటంటే రాష్ట్ర ఆస్తులను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారట. ప్రత్యేకహోదా సాధనకు కృషి చేస్తారట. అధికారంలో ఉన్న ఐదేళ్ళు హోదాని గాలికొదిలేశారు. 18 ఎంపిలున్నపుడే రాష్ట్రప్రయోజనాలను కాపాడలేకపోయారు. అలాంటిది ఇపుడు సాధిస్తామని కతలు చెబుతున్నారంటే జనాల చెవుల్లో పువ్వులు పెట్టే ప్రయత్నం తప్ప మరోటి కాదు.