ఇద్దరు ప్రేమించుకున్నారు. ఒక్కరు అంటే ఒక్కరికి ఇష్టం అనుకున్నారు. కలిసి తిరిగారు. పెళ్లి చేసుకుందాం అనేసరికి అబ్బాయి మొహం చాటేశాడు. ప్రియుడి ప్రేమ కోసం ఆమె ఆరాటపడింది. ప్రేమించి మోసం చేసి వ్యక్తిపై పోరాడింది. చివరికి ప్రియుడిపై గెలిచి మూడుముళ్ల బంధంతో ఒక్కటైయ్యారు. కానీ ఆమె తన ప్రియుడితో కళలు కన్న జీవితం కనుమరుగై వేధింపులు మొదలయ్యాయి. వ్యక్తిపై పోరాడి పెళ్లి చేసుకున్న ఆ మహిళ అతడి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఘటన నిర్మల్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

 

నిర్మల్‌ జిల్లాకు చెందిన కె.సునీత(22)కు తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. బంధువుల ఇంట్లో పెరిగిన ఆమె కొన్నాళ్ల క్రితం ఉపాధి నిమిత్తం బెంగళూరు వెళ్లింది. అక్కడ బుట్టాపూర్‌కు చెందిన దుర్గం మహేశ్‌ అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. ఇద్దరూ కొద్దిరోజులకే ప్రేమలో పడ్డారు. దీన్ని అలుసుగా తీసుకున్న మహేశ్‌ ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు.

 

ఆ తర్వాత స్వగ్రామానికి వచ్చేసి ఆమె నుంచి తప్పించుకోసాగాడు. పెళ్లి చేసుకోమని ఎన్నిసార్లు అడుగుతున్నా ప్రియుడు పట్టించుకోకపోవడంతో ఆర్నెళ్ల క్రితం ఆమె ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. గ్రామపెద్దలు, పోలీసులు జోక్యం చేసుకుని మహేశ్‌ తో ఆమెకు వివాహం జరిపించారు. కొద్దిరోజులకు దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. మహేశ్‌ తో పాటు అతడి తల్లి, బంధువులు సునీతకు తీవ్రంగా వేధించేవారు. తన బాధను చెప్పుకోవడానికి తల్లిదండ్రులు కూడా లేకపోవడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది.

 

భర్త తాగొచ్చి దూషించడంతో పాటు కొట్టడంతో సునీత మనస్తాపానికి గురై పురుగుల మందు తాగేసింది. కుటుంబ సభ్యులు ఆమెను నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయింది. భర్త, అత్తమామల వేధింపుల వల్లే సునీత ఆత్మహత్య చేసుకుందని స్థానిక ప్రజాసంఘాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: