పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అయ్యారా లేదా ? అసలు అవుతారా అనే విషయాన్ని పక్కన పెడితే, సినిమా హీరోగా ఆయన ఏ హీరోకి లేనంతమంది అభిమానుల క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో సంపాదించుకున్నారు. యూత్ ఐకాన్ గా పవన్ కళ్యాణ్ ఇప్పటికీ యువకుల మనస్సులో గూడు కట్టుకున్నారు. పవన్ ఇప్పటివరకు చేసింది పాతిక సినిమాలే అయినా ఏ హీరోకి లేనంత క్రేజ్ ఆయనకు ఉంది. పవన్ సినిమా సక్సెస్ అయినా అవ్వకపోయినా ఆయన అభిమానులు రోజురోజుకు పెరుగుతూనే ఉంటున్నారు తప్ప ఎక్కడా తగ్గడంలేదు. అది పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్. కానీ రాజకీయాల్లో మాత్రం పవన్ క్రేజ్ పనిచేయడం లేదు. పవన్ జనసేన స్థాపించిన తర్వాత నాయకుల మాట ఎలా ఉన్నా దానిని భుజాల మీద వేసుకుని మోశారు.

నాయకులు పార్టీలో చేరడం, ఏవేవో ఆరోపణలు చేసి బయటకు వెళ్లడం, ఇలా ఎన్ని చేసినా, జనసేనకు నాయకుల కొరత ఉన్నా పవన్ అభిమానుల మాత్రం ఎప్పుడూ దూరం అవ్వలేదు. మొన్నటి ఎన్నికల్లో యూత్ అంతా పవన్ కు అండగా నిలిచారు. మిగతా వర్గాల ప్రజలు మాత్రం పవన్ ను ఆదరించలేదు. దీంతో 143 స్థానాల్లో పోటీ చేసినా జనసేనకు ఒకే ఒక్క స్థానం దక్కింది. అంతేకాదు స్వయంగా రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కూడా ఓటమి మూటగట్టుకున్నారు. పవన్ ఆ ఓటమి నుంచి తేరుకునేందుకు దాదాపు నాలుగు నెలల సమయం పట్టింది. ఆ తర్వాత జనసేనాని రాజకీయం చేద్దామని భావించి విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు పవన్.

ఇక అప్పటి నుంచి చెప్పుకో దగ్గ పార్టీ కార్యక్రమాలు ఏవి జనసేన నుంచి మొదలవలేదు. మధ్యలో ఒకసారి అమరావతి ఉద్యమంలో వేలు పెట్టేందుకు ప్రయత్నించినా కొద్దిరోజులకే అది విరమించుకున్నారు. ఇక పవన్ పూర్తిగా ఇప్పుడు సినిమాలపై దృష్టిపెట్టారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఏపీలో జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెడతారా లేదా అనే విషయం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్ పర్యటన ఉంటుందని కొంతకాలంగా ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నా, విశాఖలో చంద్రబాబు కు ఏ విధంగా అయితే వ్యతిరేకత వచ్చిందో పవన్ కళ్యాణ్ కు కూడా అంతే స్థాయిలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నట్లుగా పవన్ కు సంకేతాలు అందడంతో, ఇప్పుడు జనాల్లోకి రావడం మంచిది కాదనే విషయాన్ని గ్రహించిన ట్లు తెలుస్తోంది.

మూడు రాజధానుల వ్యవహారం పూర్తిగా సద్దుమణిగిన తరువాత పొలిటికల్ గా యాక్టివ్ అవ్వాలని, అప్పటి వరకు సినిమాల్లో బిజీ గా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో జనసేన పార్టీ నాయకులోనూ, పవన్ ఫ్యాన్స్ లోనూ తీవ్రమైన నిస్తేజం అలుముకుంది. పార్టీ పెట్టిన తర్వాత కష్టమైనా, నష్టమైనా ప్రజల్లో ఉండాలి తప్ప, ఇలా పార్ట్ టైం రాజకీయాలు చేస్తే ప్రజల్లో ఉన్న విశ్వసనీయత దెబ్బతింటుందని ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి