మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషనర్ పదవీ కాలం తగ్గిస్తూ, కొత్త కమిషనర్ నియామకం కోసం ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంపై సీరియస్ అయ్యారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ పై గవర్నర్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో గత నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైందని ఇలాంటి సమయంలో ఎన్నికల కమిషనర్ ను మార్చడం ఏమిటని ప్రశ్నించారు. 
 
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ 2016 జనవరి 31 న ఐదేళ్ల పదవీ కాలానికి నియమితులయ్యారని... పదవి మధ్యలో ఆర్డినెన్స్ తీసుకురావడం ఏమిటని మండిపడ్డారు. ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ ను అమలు చేయాలంటే ఆయన పదవీ కాలం పూర్తయిన తరువాత అమలు చేయవచ్చని... మధ్యలో కొత్త ఆర్డినెన్స్ అమలు చేయాలనుకోవడం సరికాదని సూచించారు సీపీఐ నేత రామకృష్ణ కూడా కొత్త ఆర్డినెన్స్ పై విమర్శలు చేశారు. 
 
వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. నిరంకుశ విధానాలు ప్రభుత్వానికి తగవని... కొత్త ఆర్డినెన్స్ విషయంలో నిర్ణయం మార్చుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషనర్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో ఎన్నికలను వాయిదా వేశారని.... ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ అనుకూలంగా లేకపోవడం వల్లే ఇలా వ్యవహరిస్తోందని అన్నారు. ఆర్డినెన్స్ విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరని ఖండిస్తున్నామని వ్యాఖ్యలు చేశారు. 
 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడంతో శాసన మండలి రద్దు దిశగా చర్యలు చేపట్టిందని.... ప్రస్తుతం కక్ష సాధించడానికే ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వం దౌర్జ్యన్యాలకు పాల్పడిందని విమర్శలు చేశారు. ఎన్నికల కమిషనర్ పై జగన్ ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడో అర్థం కావడం లేదని... తాను గవర్నర్ కు లేఖ రాస్తానని కన్నా లక్ష్మీ నారాయణ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: