ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు క్యాంప్ కార్యాలయంలో విశాఖ గ్యాస్ దుర్ఘటనపై సమీక్ష నిర్వహించారు. సీఎస్‌ నీలం సాహ్ని, కలెక్టర్‌ వినయ్‌చంద్, పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌ కే మీనా ఈ సమీక్షలో విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సీఎస్ జగన్ కు పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. కలెక్టర్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ నివారణకు చేపట్టిన చర్యల గురించి వివరించారు. ట్యాంకర్ లోని కెమికల్ లో 60 శాతం పాలిమరైజ్ అయిందని చెప్పారు. 
 
మిగిలిన 40 శాతం కూడా పాలిమరైజ్ అవుతుందని అయితే దీనికి 18 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఫ్యాక్టరీలోని అన్ని ట్యాంకులు కూడా భద్రంగా ఉన్నాయని తెలిపారు. విశాఖకు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌ ప్రసాద్, పీసీబీ మెంబర్‌సెక్రటరీ వివేక్‌ యాదవ్‌ వస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగిన కార్యాచరణ ప్రణాళికతో రావాలని వారిని ఆదేశించారు. 
 
కాలుష్య నివారణా మండలి క్రియాశీలకంగా ఉండాలని సీఎం సూచించారు. కాలుష్యకారక అంశాలపై ఫిర్యాదులు, వాటిని నివారణకు, పాటించాల్సిన స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఇలాంటి విషవాయువులు ఉన్న ఇతర ఫ్యాక్టరీలను గుర్తించాలని ఆదేశించారు. జనావాసాల మధ్య ఉన్న పరిశ్రమలను వెంటనే గుర్తించాలని తెలిపారు. 
 
విశాఖ గ్యాస్ లీకేజ్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరిశ్రమల తరలింపుపై విధానపరమైన ఆలోచనలు చేయాలని చెప్పారు. ఫ్యాక్టరీలో ప్రస్తుతం ఉన్న రసాయనాలను తరలించే అవకాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. రసాయనాలను తరలించడం సాధ్యం కాని పక్షంలో ముడిపదార్థాలను పూర్తిగా వినియోగించేలా చర్యలు తీసుకోవాల్సిన మార్గాలపై కూడా ఇంజినీర్లతో మాట్లాడాలని సూచించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన కోటి రూపాయల పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: