కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ప్రస్తుతం ఈ పేరు వింటేనే ప్రజల్లో వణుకు పుట్టుకొస్తుంది. గత ఏడాది డిసెంబర్ నెలలో చైనాలోని వూహాన్ నగరంలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంతకర కరోనా వైరస్.. అనాతి కాలంలోనే ప్రపంచదేశాలు విస్తరించింది. ఇక అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తింగా కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. ఇప్పటికే దాదాపు 212 దేశాలకు పాకిన ఈ వైరస్.. అనేక కుటుంబాలను చిన్నా భిన్నం చేసింది. ఇక ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ కొనసాగిస్తున్నప్పటికీ.. మహమ్మారి విస్తరణకు అడ్డుకట్టవేయడం కుదరడం లేదు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2.80 లక్షల మంది కరోనా కాటుకు బలైపోయారు. అమెరికా, స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, రష్యా దేశాల్లో కరోనా ఉద్ధృత్తి తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నారు. ఈ లెక్కలు చూస్తుంటే.. ప్రస్తుతం మనం ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నామో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ఈ కరోనా వైరస్ మహమ్మారికి మందు కనిపెట్టడం అసాధ్యమని ఇంపీరియల్ కాలేజీ అఫ్ లండన్ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ నబారో భావిస్తున్నారు.
అంతేకాకుండా, గతంలో ఎయిడ్స్, డెంగ్యూ లాంటి వైరస్లకు కూడా ఇంతవరకు వ్యాక్సిన్ కనిపెట్టలేదని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం డేవిడ్ నబారో ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ 19 సలహాదారుగా పని చేస్తున్నారు. ఇక ఈయన మాట్లాడుతూ.. కరోనా వైరస్కు మందు కనిపెట్టలేమని.. ఒకవేళ కరోనా వ్యాక్సిన్ వచ్చినా అది సమర్ధవంతంగా పని చేస్తుందని చెప్పలేమని అభిప్రాయపడ్డారు. మరోవైపు కరోనాకు వ్యాక్సిన్ తప్పకుండా వస్తుందని చాలా మంది నిపుణులు అంటున్నారు. ఎందుకంటే హెచ్ఐవి, మలేరియా వంటి వ్యాధుల మాదిరిగా కాకుండా, కరోనావైరస్ చాలా నెమ్మదిగా పరివర్తనం చెందుతుందని వారు భావిస్తున్నారు. కానీ, నబారో మాత్రం కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేసే విధానం నెమ్మదిగా, బాధాకరంగా ఉంటుందని వ్యాఖ్యానించింది.