కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. రాష్ట్రాలకు రాష్ట్రాలకు అతలాకుతలమవుతున్నాయి. వేలల్లో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. ఇక..స్టేజ్ త్రీ మొదలైదంటే... వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం మన తరం కాదు. దాని వేగం అంచనా వేయడం సాధ్యం కాదు. కనీసం... వైరస్ వ్యాప్తి ఎక్కడ మొదలైందో తెలుసుకునే అవకాశం కూడా ఉండదు. క్షణాల్లో, నిమిషాల్లో, గంటల్లో పదులు, వందలు,వేల సంఖ్యలో జనం వైరస్ బారిన పడతారు. చూస్తుండగానే... కేసుల సంఖ్య అపరిమితంగా పెరిగిపోతుంది. ఇదంతా స్టేజ్ త్రీ లో జరిగే పరిణామం.
డాక్టర్ గిరిధర్ జ్ఞాని... ! కోవిడ్ 19 హాస్పిటల్స్ టాస్క్ ఫోర్స్ కన్వీనర్ . ఆయన అంచనా ప్రకారం.. భారత్.. స్టేజ్ త్రీ ప్రారంభంలో ఉంది. అధికారికంగా ఈ విషయాన్ని ద్రువీకరించలేమని ఆయన అంటున్నా...వాస్తవం మాత్రం ఇదే. భారత్.. ప్రమాదకరమైన స్టేజ్ త్రీ లోకి అడుగుపెట్టేసింది. అధికారికంగా ఓ ప్రకటన వెలువడ్డమే మిగిలింది.
డాక్టర్ గిరిధర్ జ్ఞాని అంచనా ప్రకారం... రానున్న పది రోజుల్లో కరోనా విషయంలో కీలక పరిణామాలు వెలుగుచూడనున్నాయి. కరోనా సోకినా.. ఇప్పటిదాకా ఆ వైరస్ లక్షణాలు లేని వ్యక్తుల్లో ఇక... లక్షణాలు కనపించడం మొదలవుతుంది. ఈ దశలో బాధితులకు సరైన సమయంలో చికిత్స అందించకపోతే...పరిస్తితులు చేయిదాటిపోతాయి.
మార్చి 24 న ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఆనాటి సమావేశంలోనే ... ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. డాక్టర్ గిరిధర్ జ్ఞాని తన అంచనాల్ని , అనుమానాల్ని ఆయన ముందుంచారు. వాస్తవ పరిస్తితులు వెల్లడించారు.
ప్రభుత్వాల దగ్గర టెస్టింగ్ కిట్లు సరైన సంఖ్యలో లేకపోవడం ప్రమాదకరమైన పరిణామమనేది డాక్టర్ గిరిధర్ జ్ఞాని వాదన. ఇక పరీక్షల నిర్వహణకు విధించుకున్న ప్రమాణాల్ని కూడా మార్చాలన్నది ఆయన సూచన. ఇప్పటిదాకా... దగ్గు,జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పద్దతి మారాలంటారు డాక్టర్ గిరిధర్ . ఈ మూడు లక్షణాల్లో ఏదో ఒకటి ఉన్నా సరే...పరీక్ష చేయాల్సిందేనంటారాయన. ఏదో ఒక లక్షణమే ఉందన్న కారణంగా చాలా చోట్ల టెస్టులు నిరాకరిస్తున్నారు. ఒక్క లక్షణమే ఉంది కాబట్టి టెస్ట్ చేయడం వల్ల కిట్ వృథా అవుతుందన్న ఉద్దేశం కూడా సరి కాదు .
ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించినా టెస్టులు చేయడం అత్యవసరం . వైరస్ చెయిన్ ను బ్రేక్ చేయడానికి ఇదే మార్గం. వైరస్ విస్తరిస్తున్న వేగానికి కళ్లెం వేయాలంటే...దేశవ్యాప్తంగా టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. స్టేజ్ త్రీ ముంగిట్లో ఉన్న దేశం..కరోనాను సమర్ధంగా ఎదుర్కోవాలంటే.. ఇది తప్పనిసరి.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాసుపత్రుల్ని .. కోవిడ్ ఆస్పత్రులుగా మార్చాలని ప్రధాని అధ్యక్షతన జరిగిన హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ సమవేశంలో నిర్ణయం తీసుకున్నారు. కరోనాపై పోరాటంలో నిజంగా ఇది కీలక నిర్ణయం . అయితే.. అసలు సిసలు సవాల్ ఇక్కడే ఉంది. ఈ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, సిబ్బంది కొరతను గుర్తించడం.. వాటని భర్తీ చేయడం. ముందుగా ఆస్పత్రుల్ని గుర్తించి.. సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ప్రభుత్వం ముందున్న సవాళ్లు. సమయం తక్కువగా ఉంది. విపత్తు ముంచుకొస్తోంది. స్టేజ్ త్రీ తన కోరలు విసరకముందే.. మేల్కోవాలి.