భారత్ లో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలో భారీగా కేసులు నమోదవుతున్న దేశాల్లో మన దేశం టాప్ లో నిలుస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 52,050 కేసులు నమోదు కాగా 803 మంది కరోనా రోగులు మృత్యువాత పడ్డారు. ఇదే సమయంలో అమెరికాలో 48,622 కేసులు, బ్రెజిల్ లో 17,988 కేసులు, ఫిలిప్పీన్స్ లో 13,226 కేసులు నమోదయ్యాయి.
 
గత కొద్ది రోజులుగా ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్న దేశాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉండటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రజలను కలవరపెడుతోంది. దేశంలో కొత్తగా నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 18,55,745కు చేరగా 38,938 మంది మృతి చెందారు. వీరిలో 12 లక్షల 30 వేల మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 5,86,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే దేశంలో 44,000 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
 
ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 65.77 శాతంగా ఉండగా కరోనా మరణాల రేటు 2.1 శాతంగా ఉంది. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు అక్కడ 15,700 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. నిత్యం అక్కడ 250కి పైగా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోను రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి.
 
తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కరోనా విషయంలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో ప్రతిరోజూ వెయ్యికి అటూఇటుగా కేసులు నమోదవుతుండగా ఏపీలో మాత్రం 8,000కు అటూఇటుగా కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో నిన్న ఒక్కరోజే 45,516 శాంపిళ్లను పరీక్షించగా 7,822 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో తూర్పుగోదావరి, కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: