ప్రస్తుతం వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు జగన్ మీద అభిమానంతోనే ఉంటారు. అసలు ఆయన బొమ్మ వల్లే 151 మంది గెలవగలిగారు కాబట్టి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే జగన్ పట్ల విధేయతతో ఉంటారు. అయితే వీరిలో కొందరు జగన్‌కు వీరాభిమానులు కూడా ఉన్నారు. అలాంటి వీరాభిమానుల్లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ముందు వరుసలో ఉంటారు.

రాజకీయాల్లో మంచి స్నేహం కొనసాగిస్తున్న ఈ ఇద్దరు నెల్లూరు జిల్లా వైసీపీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ వరుసగా రెండుసార్లు వైసీపీ నుంచి గెలవగా, కోటంరెడ్డి నెల్లూరు రూరల్ నుంచి రెండుసార్లు గెలిచారు. ఇక ప్రస్తుతం అనిల్, జగన్ కేబినెట్‌లో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో కీలకంగా ఉన్న ఈ ఇద్దరు నేతలకు చంద్రబాబు చెక్ పెట్టేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.

2019 ఎన్నికల్లోనే అనిల్‌కు చెక్ పెట్టేందుకు మాజీ మంత్రి నారాయణని సిటీ బరిలో దింపారు. కోట్లు కోట్లు ఖర్చు పెట్టించారు. అయినా సరే అనిల్‌ని ఓడించలేకపోయారు. నారాయణ ఓడిపోయాక రాజకీయాలకు దూరంగా జరిగారు. దీంతో బాబు సిటీలో మరోనాయకుడుని దించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని నియమించారు. ఇంఛార్జ్‌గా వచ్చాక శ్రీనివాసులురెడ్డి దూకుడుగానే పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా అనిల్‌ని ఓడించాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నారు.

అటు రూరల్‌లో ఎమ్మెల్యే కోటంరెడ్డికి చెక్ పెట్టేందుకు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ కష్టపడుతున్నారు. 2019 ఎన్నికల్లో కోటంరెడ్డిపై ఓడిపోయిన అజీజ్, తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీ నేతలు ఎంత ప్రయత్నించినా నెల్లూరులో అనిల్, కోటంరెడ్డిలకు చెక్ పెట్టడం సాధ్యం కాదని తెలుస్తోంది. జిల్లాలో ఈ ఇద్దరు నేతలకంటూ ప్రత్యేక ఇమేజ్ ఉంది. పైగా జగన్ ఇమేజ్ తోడైతే వీరి గెలుపుని అడ్డుకోవడం చాలా కష్టం. కాబట్టి జగన్ అభిమానులుగా ఉన్న వీరికి బాబు చెక్ పెట్టడం జరిగే పని కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: