హైదరాబాద్ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తుంది. పగటి వేళల్లో సమయాన్ని బట్టి రెండు, మూడు గంటలు ట్రాఫిక్ లో అవస్థలు పడాల్సిన దుస్థితి దాపురించింది. ఈ ట్రాఫిక్ కష్టాలకు చెక్ చెబుతూ మాదాపూర్ దుర్గం చెరువు దగ్గర .. కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చేసింది. దేశంలోని అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా నిర్మితమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కావడంతో.. మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
184 కోట్ల రూపాయల వ్యయంతో 754.38 మీటర్ల పొడవుగల బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేశారు బల్దియా ఇంజనీరింగ్ అధికారులు. దుర్గం చెరువుకు ఇరువైపులా 20 మీటర్ల ఎత్తులో వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో మొత్తం 13 ఫౌండేషన్లు ఏర్పాటు చేశారు. స్టే-కేబుళ్లను ఆస్ట్రియా నుండి ప్రత్యేకంగా తెప్పించారు. దుర్గం చెరువు పరిసరాల్లో పర్యావరణం దెబ్బతినకుండా.. కేవలం 2 ఫిల్లర సహాయంతో 735 మీటర్ల పొడపున్న తీగల వంతెనను ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించింది. 8 దేశాల ఇంజనీర్లు దీని నిర్మాణంలో పాలు పంచుకున్నారు.
బ్రిడ్జి నిర్మాణంతో మాదాపూర్, జూబ్లీహిల్స్ల మధ్య దూరం తగ్గనుంది. మొట్టమొదటి హైదరాబాద్ హ్యాంగింగ్ బ్రిడ్జిగా పేరొందడంతో పాటుగా మంచి పర్యాటక ప్రాంతంగా రూపొందనుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్కు కేబుల్ బ్రిడ్జి ప్రత్యేక ఐకానిక్గా రూపొందనుంది. రోడ్డు నెంబర్ నెం 36, జూబ్లీహిల్స్, మాదాపూర్లపై ఒత్తిడి గణనీయంగా తగ్గనుంది. జూబ్లీహిల్స్ నుండి మైండ్స్పేస్, గచ్చిబౌలిలకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. పంజాగుట్ట నుంచి నానక్ రాంగూడలోని బాహ్యావలయ రహదారికి రోడ్ నెంబర్ 45 ద్వారా అతి సులభంగా చేరుకోవచ్చు. ఈ నిర్మాణానికి మరో ప్రత్యేకత ఆకర్షణ ఎల్ఈడీ లైట్లు నిలవనున్నాయి. మొత్తం 40 వేల ఎల్ఈడీ లైట్లను దీనిపై అమర్చారు.
రవాణా సౌకర్యంగానే కాకుండా దుర్గం చెరువు పరిసరాలను పర్యాటకంగాను ముస్తాబు చేస్తున్నారు. శనివారం, ఆదివారాల్లో పర్యాటకులను మాత్రమే కాలినడకన కేబుల్ బ్రిడ్జిపైకి అనుమతించనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి