ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పంట పూర్తిస్థాయిలో ధ్వంసం అవ్వగా... చేతికొచ్చిన పంట కూడా మద్దతు ధర లేకపోవడంతో రైతుల పాలిట శాపంగా మారింది. ఇక మరోపక్క దోమకాటు సహ తెగుళ్లతో సరైన దిగుబడి కూడా రాకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇప్పటికే ఎంతో కష్టపడి అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టి పంట వేసిన రైతులు అందరికీ ఈ సన్న రకం వరి మరింత అప్పులపాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం చెప్పినట్లుగా తాము సన్న రకం వరి పండించినందుకు అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తమను ఆదుకోవాలని పలువురు రైతులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్న ఘటనలు ఎన్నో తెర మీదకి వస్తున్న విషయం తెలిసిందే.
ఇక ప్రభుత్వం చెప్పినట్లుగా సన్న రకం వరి సాగు చేసినందుకుగాను కనీసం తమ పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదు అని భావిస్తున్న రైతులు కొన్నిప్రాంతాల్లో ఏకంగా బాధతో నిండి పోయిన హృదయంతో పంట కాల్చేస్తున్నారు. గతంలో దొడ్డు రకం వరి సాగు చేసిన సమయంలో కాస్తో కూస్తో లాభాలను ఆర్జించాము అంటూ చెబుతున్న రైతులు.. ఈసారి ప్రభుత్వం సూచించినట్లుగా సన్న రకం వరి సాగు చేయడం ద్వారా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయామని ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.,.