తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బిజెపిలో చేరబోతున్నారు అంటూ గత కొంతకాలంగా అదేపనిగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ల సమక్షంలో రేవంత్ బిజెపిలో చేరుతున్నారని కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులు ఆయనకు నచ్చడం లేదని, అందుకే బీజేపీలో చేరి తన రాజకీయ భవిష్యత్తు కు ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారని అంతా భావిస్తున్నారు అంటూ చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వ్యవహారాలపై లింగోజిగూడ ఎన్నికల ప్రచారం లో రేవంత్ స్పందించి, సంచలన ఆరోపణలు చేశారు.
తాను బీజేపీలో చేరుతున్నానని , తనకు
కాంగ్రెస్ పెద్దలు పెద్ద పదవి ఇవ్వనున్నారని అసత్య ప్రచారాలు
బిజెపి చేయిస్తోందని, అన్ని
టీవీ ఛానల్ లోగోల తో మార్ఫింగ్ చేసిన ఫేక్ వీడియోలు గ్రేటర్ పోలింగ్ కు ఒకరోజు ముందు చేయడానికి కుట్ర చేశారన్నారు. తనపై వచ్చిన ఇటువంటి చిల్లర ప్రచారాలను కార్యకర్తలు ఎవరూ నమ్మవద్దని , నేను పదవుల కోసం
కాంగ్రెస్ లో చేరలేదని చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికల కు ఒక్కరోజు ముందు
కాంగ్రెస్ అభ్యర్థి టిఆర్ఎస్ లో చేరుతున్నారు అంటూ ఓ ఛానల్లో లోగో తో దుష్ప్రచారం చేశారని, అది నిజమేనని యువత గందరగోళానికి గురి అయ్యి బిజెపికి ఓటు వేశారని ఆరోపించారు. మేము నష్ట నివారణకు దిగేసరికి 40 శాతం పోలింగ్ అయిపోయింది అని , మరోసారి ఇదేవిధంగా గ్రేటర్ ఎన్నికల్లో చేసేందుకు
బీజేపీ కుట్ర చేస్తోందని , ఇవన్నీ ఎవరు నమ్మవద్దని
రేవంత్ క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటి వరకు
రేవంత్ బీజేపీ లో చేరుతున్నారని పెద్ద ప్రచారమే నడుస్తున్నా,
రేవంత్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ గ్రేటర్ ఎన్నికల్లో ఈ అంశం నష్టం చేకూర్చే అవకాశం ఉండడం తో ఇప్పుడు క్లారిటీ ఇచ్చినట్లుగా కనిపిస్తున్నారు.