ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై స్పష్టత వచ్చింది. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో బరిలో మిగిలిందెవరో తేలిపోయింది. ఒక్కరే బరిలో మిగిలితే ఏకగ్రీవం అయినట్టే కదా. మొత్తం మీద తొలిదశలో 12 జిల్లాల్లో 15.91 శాతం పంచాయతీల్లో ఏకగ్రీవమైనట్టు తెలుస్తోంది. 3,249 గ్రామాల్లో 517 చోట్ల పోటీలేకుండానే విజయం ఖరారైంది. ఏకగ్రీవాలు పోను 2,732  పంచాయతీల్లో  ఎన్నికలు జరుగుతాయన్నమాట.

ఈ ఏకగ్రీవాల్లో సహజంగానే అధికార పార్టీ హవా చాటింది. 12 జిల్లాల్లో ఏకగ్రీవంగా  468 మంది వైకాపా మద్దతుదారులు ఎన్నికయ్యారు. ఇక 22 మంది తెలుగుదేశం సానూభూతిపరులు  కూడా ఏకగ్రీవం అయ్యారు. వీరు కాకుండా సర్పంచులుగా  27 మంది స్వతంత్ర అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ఇక జిల్లాల వారీగా చూస్తే.. శ్రీకాకుళం జిల్లాలో తొలివిడత జరిగిన 321 పంచాయతీల్లో దాదాపు 10 శాతం అంటే.. 39 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇవి పోగా మిగిలిన 282 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయతీల లెక్కలు చూస్తే.. అత్యధికంగా పాతపట్నం నియోజకవర్గంలో 25, టెక్కలిలో 12, ఎచ్చెర్లలో 2  ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవమైన పంచాయతీల్లో సంతబొమ్మాళి మండలంలో కాపుగోదాయవలస, తాళ్లవలస, ఆకాశలఖవరం  పంచాయతీలు ఉన్నాయి. హిరమండలం మండలంలోని ఆరు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆర్. ఆర్ కాలనీ, గొట్ట, రుగడ, మర్రిగూడ, పెద్దగూడ, భగీరథపురం పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.

పాతపట్నం మండలంలో చాకిపల్లి, పెద్దసున్నాపురం, సీతారాంపల్లి దశరథపురం, సరాలి పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. కొత్తూరు మండలంలో 8 పంచాయతీల్లో ఏకగ్రీవం అయ్యాయి. అల్తి, రాయల, ఎం.జె పురం,కౌసల్యాపురం, సోమరాజుపురం, అడ్డంగి, ఇరపాడు గూడ, గొట్టిపల్లి పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. సోంపేట మండలంలో  పొత్రఖండ, కంచిలి మండలంలోని పోలేరు, ఎం. ఎస్. పల్లి, ముండల పంచాయతీలు.. కవిటి మండలంలో ని బైరిపురం, దుగాన పుట్టుగ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: