కరోనా సెకండ్ వేవ్...ఇప్పుడు ఈ విషయం అందరినీ ఎంతో భయాందోళనకు గురి చేస్తోంది. గతంలో వచ్చిన కరోనా మొదటి దశ కంటే ఇది అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ఈ కరోనా సృష్టిస్తున్న విలయతాండవం నుండి తప్పించుకోవడానికి ప్రపంచంలోని ప్రజలంతా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాలు సైతం కరోనా మహమ్మారిని నియంత్రించడానికి అన్ని విధాలుగా, వారి శాయశక్తులా తమ కృషి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు తెలియచేస్తున్నారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ దశలో కేవలం 45 సంవత్సరాలు ఉన్న వారి నుండే వ్యాక్సిన్ వేస్తున్నారు. వచ్చే నెల నుండి ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసింది.

ముఖ్యంగా ఈ కరోనా సెకండ్ వేవ్ లో ఇంతకు ముందుకన్నా వ్యాప్తి చాలా వేగంగా జరుగుతోంది. ఉదాహరణకు ఒక కుటుంబంలో ఒక మనిషికి కరోనా వస్తే...కొన్ని గంటల వ్యవధిలోనే ఆ కుటుంబమంతా వ్యాపిస్తోంది. దీని వలన ప్రజలు కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ కొనసాగుతోంది. మహారాష్ట్రలోని ముంబైలో ఎక్కువ కేసులు ఉన్నందున అక్కడ  లాక్ డౌన్ ఆంక్షలు విధించారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 6 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. కానీ ఆ తరువాత కూడా లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనూ రాత్రి సమయాలలో కర్ఫ్యూ విధించారు.

గతంలో కరోనా వ్యాప్తికి ప్రధాన కారణమయిన అంతర్జాతీయ విమాన  ప్రయాణాల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రముఖ విమాన సంస్థ ఎయిర్ ఇండియా వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఉన్న ఎయిర్ ఇండియా సేవలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ఏప్రిల్ 30 వరకు కొనసాగనుంది. ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో కొంతమేర విదేశాల వల్ల వచ్చే కరోనా కేసులు తగ్గే అవకాశముంది. ముందు ముందు మరేమి జరగనుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: