ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన బృహత్తర కార్యం రిజర్వాయర్ల నిర్మాణాలు. చుక్క నీరు లేక అల్లాడిపోతున్న తెలంగాణకు గంగా, గోదావరి నీళ్లను అందించి భూముల్లో పచ్చని సిరులు పండేలా చేయాలనే నినాదంతో ముందుకు సాగుతోంది. అలా సాగుతున్న ఈ ప్రయత్నానికి ఎంతో మంది ప్రజలు కొన్ని ఏళ్ల నుంచి తాము సాగు చేసుకుంటున్న భూమిని, సర్వస్వాన్ని వదిలి ప్రభుత్వానికి సహకరిస్తున్నారనడంనలో ఎలాంటి దురుద్దేశం లేదు. ఇలా వీరు చేసిన త్యాగంతో కొన్ని లక్షల ఎకరాలకు నీరంది పంటలు పండుతాయని, ఎంతోమంది రైతు కుటుంబాలు నీరాస్తే బాగుపడతాయని భావించి వారి జీవనోపాధి అయినా భూములను, సర్వస్వాన్ని ప్రాజెక్టుల కోసం త్యాగం చేశారు. అలాంటి ప్రాజెక్టే సిద్దిపేట జిల్లాలోని వేములఘాట్ మండలంలో ఉన్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు.
అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు, ఇంటి నిర్మాణాలు చేపట్టి వారికి అందజేసింది. ఈ తతంగంలో కొంత మంది రాజకీయ నాయకులు, అధికారులు తమ దుర్బుద్ధితో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు అన్యాయం చేసి, చేతివాటం చూపిస్తున్నారు. దీంతో ఆవేదన చెందిన రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగి విసుగుచెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిన్నటికి నిన్న ఏడు పదుల వృద్ధుడు తన ఇంటి కట్టెలతో చితి పేర్చుకుని కిరోసిన్ పోసుకొని తనకు తానే నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన మరువక ముందే మరికొంత మంది బాధితులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నామని, వారికి పరిహారం రాకుండా సర్పంచ్ కొడుకు అడ్డుపడుతున్నాడని తమ ఆవేదనను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా వేములఘాట్ కు చెందిన కుమ్మల లక్ష్మయ్య, కొంత మంది రైతులకు పరిహారం రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పాత ఇండ్లలోనే ఉంటూ కాలం వెళ్లదీస్తున్నమని, పాములు తేళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా సర్పంచ్ ని అడిగితే నీకు ఇండ్లు రావని మీరు ఎక్కడ చెప్పుకుంటారో అక్కడ చెప్పుకోమని బెదిరింపులకు గురి చేస్తున్నాడని వారంటున్నారు. ఏది ఏమైనా ఆ పేద ప్రజలకు ఇండ్లు వచ్చేటట్టు చూడాలని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు.