టీడీపీ అధినేత నారా చంద్రబాబు భార్య భువనేశ్వరి సహజంగా బయటకు రారు. తానేమిటో తన ఇల్లేమిటో.. తన ఆఫీసేమిటో అన్నట్టుగా ఉంటుంది ఆమె వ్యవహరం. అలాంటి నారా భువనేశ్వరి ఏపీ అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యల ఎపిసోడ్ కారణంగా ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. తన భార్యపై సాక్షాత్తూ అసెంబ్లీలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ తర్వాత చంద్రబాబు మీడియా ముందే భోరున విలపించారు కూడా. ఈ ఎపిసోడ్ తర్వాత నారా భువనేశ్వరి పెద్దగా బయటకు రాలేదు. అసెంబ్లీలో తనపై చేసిన వ్యాఖ్యలకు కూడా ఆమె ఓ పత్రికా ప్రకటన ద్వారానే స్పందించారు.


అలాంటి భువనేశ్వరి తాజాగా ఎన్టీఆర్ ట్రస్టు కార్యక్రమాల్లో భాగంగా చిత్తూరు జిల్లాకు వచ్చేశారు. అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి సాక్షాత్తూ చంద్రబాబు సతీమణి కళ్ల ఎదురుగా కనిపిస్తే మీడియా మిత్రులు ఇక తమ బుర్రలకు పదును పెడతారన్న సంగతి తెలిసిందే. అలాగే నారా భువనేశ్వరి మందు కూడా పెట్టారు. దీనికి స్పందించిన ఆమె..  అసెంబ్లీలో జరిగిన ఘటనను పట్టించుకోకూడదని.. ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని హితవు పలికారు.  తప్పుడు వ్యాఖ్యలు చేసిన వాళ్ళు వాళ్ళ పాపాన వాళ్ళు పోతారని భువనేశ్వరి స్పందించారు.


అయితే ఇప్పుడు నారా భువనేశ్వరి పెట్టిన శాపాలు ఆమె భర్తకే తగులుతాయంటున్నారు మంత్రి కొడాలి నాని. ఆయన ఇంకా ఏమన్నారంటే.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెప్పినట్లు తప్పుడు వ్యాఖ్యలు చేసిన వాళ్ళు వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు... వ్యాఖ్యలు చేయకపోయినా చేసినట్లు చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు... ఎవరనై భార్యని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారా... ఆమె శాపం చంద్రబాబుకి తప్పనిసరిగా తగులుతుంది అంటున్నారు మంత్రి కొడాలి నాని.. అంతే కాదు.. చంద్రబాబుకి రాబోయే ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతుందని మంత్రి కొడాలి నాని శాపనార్థాలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: